కరోనా మరణాల్లో ఊహించని ట్విస్ట్: మొదట నెగెటివ్ : కొద్దిరోజులకే వైరస్తో మృతి: కొత్తగా రూపాంతరం?
ముంబై: ప్రాణాంతక కరోనా వైరస్ మరణాల్లో అనూహ్య పరిణామం ఒకటి చోటు చేసుకుంది. ఇప్పటిదాకా ఈ తరహా ఉదంతం తలెత్తకపోవడం డాక్టర్లను భయాందోళనలకు గురి చేస్తోంది. కరోనా నెగెటివ్గా తేలిన ఓ వృద్ధురాలు అదే వైరస్ బారిన పడి మరణించారు. ఈ ఘటన అటు ప్రభుత్వాన్ని, ఇటు అధికారులను ఉలిక్కిపడేలా చేసింది. తప్పు ఎక్కడ జరిగిందనే విషయంపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది.
పుణేలో చోటు చేసుకున్న ఉదంతం..
మహారాష్ట్రలోని పుణేలో చోటు చేసుకున్న ఘటన ఇది. 60 సంవత్సరాల వృద్ధురాలు ఒకరు కొద్దిరోజుల కిందట తీవ్రమైన దగ్గు, జలుబుతో బాధపడ్డారు. ఎన్ని మందులు తీసుకున్నప్పటికీ.. తగ్గకపోవడంతో కుటుంబ సభ్యులు ఆమెను పుణేలోని సస్సూన్ ఆసుపత్రికి తరలించారు. అక్కడి డాక్టర్లు ఆమెకు వైద్య పరీక్షలను నిర్వహించారు. రక్త నమూనాలను సేకరించి కరోనా వైరస్ ల్యాబొరేటరీకి పంపించారు.
నెగెటివ్గా తేలడంతో డిశ్చార్జి..
రక్త పరీక్షా నివేదికలు నెగెటివ్గా తేలాయి. ఆ వృద్ధురాలిలో కరోనా వైరస్ లక్షణాలు లేవని డాక్టర్లు నిర్ధారించారు. దీనితో ఆమెను డిశ్చార్జి చేశారు. అక్కడితో బాగానే ఉన్నప్పటికీ.. రెండు రోజుల కిందట- అంటే ఈ నెల 3వ తేదీన ఆ వృద్ధురాలు మరణించారు. మరోసారి అనారోగ్యానికి గురైన ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ సందర్భంగా ఆమెకు కరోనా వైరస్ సోకినట్లు డాక్టర్లు నిర్ధారించారు. తొలుత నెెగెటివ్గా తేలి, అనంతరం కరోనా వైరస్ వల్లే మరణించడం కలకలం రేపింది.
దర్యాప్తునకు ఆదేశించిన ప్రభుత్వం..
ఈ ఉదంతంతో మహారాష్ట్రలోని ఉద్ధవ్ థాకరే ప్రభుత్వం ఉలిక్కి పడింది. ఈ ఘటనపై సమగ్ర విచారణకు ఆదేశించింది. తప్పు ఎక్కడ జరిగిందనే విషయంపై ఆరా తీస్తోంది. వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారులు దీనికోసం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. లాబొరేటరీలో పరీక్షల సందర్భంగా పొరపాటు చేశారా? లేక.. పరీక్షలకు కూడా అందని విధంగా కరోనా వైరస్ రూపాంతరం చెందిందా? అనే విషయంపై దర్యాప్తు చేపట్టారు.
టాప్లో ఉన్న మహారాష్ట్ర..
కాగా- దేశవ్యాప్తంగా కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 3,347కు చేరుకుంది. ఇందులో మహారాష్ట్ర టాప్లో కొనసాగుతోంది. దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందడం ఆరంభమైనప్పటి నుంచీ మహారాష్ట్ర అగ్రస్థానంలోనే కొనసాగుతోంది. మహారాష్ట్రలో ఇప్పటిదాకా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 537కు చేరుకుంది. మహారాష్ట్రలోని అన్ని జిల్లాల్లోనూ కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి ప్రభుత్వం ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ.. ఆశించిన ఫలితాలు రావట్లేదని అంటున్నారు.