Coronavirus: కరోనా అనుమానాస్పద వ్యాధితో బెంగళూరులో ఆంధ్రా మహిళ మృతి !
బెంగళూరు: కరోనా వైరస్ (COVID 19) మహమ్మారి అనుమానిత వ్యాధి సోకిన మహిళ చికిత్స విఫలమై మృతి చెందిన ఘటన బెంగళూరు నగరంలో జరిగింది. ఇటీవల మక్కా యాత్ర ముగించుకుని కర్ణాటకలోని కుమారుడి ఇంటికి వచ్చిన ఆంధ్రప్రదేశ్ కు చెందిన మహిళ అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరింది. బెంగళూరు నగరంలోని బౌరింగ్ ఆసుపత్రిలో చికిత్స విఫలమై ఆ మహిళ మృతి చెందిందని, ఆమెకు కరోనా వైరస్ సోకిందనే విషయంలో వైద్యులు ఇంకా క్లారిటీ ఇవ్వలేదని, వైద్య నివేదికలు అందవలసి ఉందని కర్ణాటక ఆరోగ్య శాఖా మంత్రి బళ్లారి శ్రీరాములు స్పష్టం చేశారు.
మక్కా యాత్రకు వెళ్లిన ఆంధ్రా మహిళ
ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం జిల్లా, హిందూపురంకు చెందిన 75 ఏళ్ల మహిళ మక్కా యాత్రకు వెళ్లింది. ఇటీవల మక్కా యాత్ర ముగించుకుని భారత్ చేరుకున్న ఆమె కర్ణాటకలోని గౌరీబిదనూరు (హిందూపురం సరిహద్దు)లో నివాసం ఉంటున్న కుమారుడి ఇంటికి వెళ్లింది.
అనుమానంతో క్వారంటైన్
మక్కా యాత్ర ముగించుకుని సొంత ఊరికి చేరుకున్న ఆ మహిళ అనారోగ్యానికి గురైయ్యింది. విదేశాలకు వెళ్లిన వారికి కరోనా వైరస్ సోకుతుందని తెలుసుకున్న ఆ మహిళ గౌరీబిదనూరులోని కుమారుడి ఇంటిలో స్వీయ నిర్భంధం (క్వారంటైన్)లోనే 10 రోజులు గడిపారు.
నాలుగు ఆసుపత్రులు !
మంగళవారం ఇంటిలో క్వారంటైన్ లో ఉన్న ఆ మహిళ శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడటంతో ఆమెను గౌరీబిదనూరులోని ఆసుపత్రికి తరలించారు. వైద్యుల సూచనమేరకు ఆమెను చిక్కబళ్లాపురం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు మావల్ల కాదని చేతులు ఎత్తివేయడంతో బెంగళూరులోని మరో ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యుల సూచనమేరకు ఆమెను బెంగళూరులోని బౌరింగ్ ఆసుపత్రికి తరలించారు.
Recommended Video
కరోనా వైరస్ వచ్చిందని చెప్పలేం !
బౌరింగ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 75 ఏళ్ల మహిళ చికిత్స విఫలమై మరణించారని. ఆమె మధుమేహం, శ్వాసకోశ వ్యాధి, చాతినొప్పి, Hip Fracture సమస్యలతో చికిత్స పొందుతూ విఫలమై మృతి చెందారని వైద్యులు సమాచారం ఇచ్చారని, ఆమెకు కరోనా వైరస్ వచ్చి చనిపోయింది అనే విషయంపై క్లారిటీ లేదని, వైద్య నివేదికలు అందవలసి ఉందని, పూర్తి సమాచారం తెలిసిన తరువాత వివరణ ఇస్తామని ఆరోగ్య శాఖా మంత్రి బళ్లారి శ్రీరాములు ట్వీట్ చేశారు. మొత్తం మీద మక్కా యాత్రకు వెళ్లి వచ్చిన ఆంధ్రప్రదేశ్ లోని హిందూపురంకు చెందిన మహిళ బెంగళూరులో అనుమానాస్పద కరోనా వైరస్ వ్యాధితో మరణించిందనే విషయం బయటకు రావడంతో ప్రజలు హడలిపోయారు.