జేసీబీ డ్రైవర్ల పైశాచికత్వం: యువతి కిడ్నాప్..రెండు రోజుల పాటు గ్యాంగ్రేప్
లక్నో: ఉత్తర ప్రదేశ్లోని మరో అమానవీయ ఉదంతం చోటు చేసుకుంది. హత్రాస్ ఘటన సృష్టించిన రాజకీయ వేడి చల్లారక ముందే.. మరో దారుణం సంభవించింది. దళిత యువతిని అపహరించిన ఇద్దరు వ్యక్తులు.. ఆమెను నిర్బంధించి అత్యాచారానికి పాల్పడ్డారు. రెండు రోజుల పాటు ఆమెపై పైశాచికత్వాన్ని ప్రదర్శించారు. బాధితురాలికి న్యాయం చేయాల్సిన పోలిసులు లంచం తీసుకుని కేసును పక్కదారి పట్టించడానికి ప్రయత్నించారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
ఉత్తర ప్రదేశ్లోని బారాబాంకి జిల్లాలో శనివారం ఈ ఘటన చోటు చేసుకుంది. బారాబాంకి పోలీస్ స్టేషన్ పరిధిలోని సుబేహా గ్రామానికి చెందిన ఓ యువతిని రెండురోజుల కిందట ఇద్దరు జేసీబీ ప్రొక్లెయినర్ డ్రైవర్లు అపహరించారు..నిర్బంధించారు. ఆమెపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డారు. వారిద్దరినీ పూర్వాంచల్ ఎక్స్ప్రెస్ వే రోడ్డును నిర్మించే ఓ ప్రైవేటు సబ్ కాంట్రాక్ట్ సంస్థకు చెందిన సిబ్బందిగా గుర్తించారు. సుబేహా గ్రామం మీదుగా ఈ ఎక్స్ప్రెస్ వేను నిర్మిస్తున్నారు.
నిర్మాణ పనుల్లో భాగంగా సుబేహా గ్రామం సమీపంలో మట్టిని తరలించడానికి జేసీబీలను వినియోగిస్తున్నారు. వాటి డ్రైవర్లు అదే గ్రామానికి చెందిన దళిత యువతిని కిడ్నాప్ చేశారు. తమ నివాసంలో ఆమెను నిర్బంధించి, గ్యాంగ్రేప్నకు పాల్పడ్డారు. తమ కుమార్తె కనిపించట్లేదంటూ ఆదివారం ఉదయం బాధితురాలి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేయడానికి పోలీసులు బాధితురాలి కుటుంబ సభ్యుల నుంచి 10 వేల రూపాయల లంచాన్ని అడిగారనే ఆరోపణలు ఉన్నాయి.
ఈ విషయం తన దృష్టికి రావడం బారాబాంకి జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ అరవింద్ చతుర్వేది జోక్యం చేసుకున్నారు. ఈ కేసును ఆయనే స్వయంగా పర్యవేక్షించారు. కుటుంబ సభ్యుల అనుమానం మేరకు జేసీబీ డ్రైవర్లు ఆరిఫ్, ముదస్సర్ను అరెస్టు చేశారు. విచారణ సందర్భంగా వారు తమ నేరాన్ని అంగీకరించినట్లు చతుర్వేది చెప్పారు. నిందితులు రోడ్డు పక్కన తాత్కాలికంగా ఏర్పాటు చేసుకున్న నివాసం నుంచి బాధితురాలిని రక్షించారు. అనారోగ్యానికి గురైన ఆమెను ఆసుపత్రికి పంపించారు. నిందితులపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు ఎస్పీ తెలిపారు.