పెళ్లయిన మరునాడే యువతిని కత్తితో పొడిచిన ప్రియుడు
ప్రేమించుకున్నామా.. అయితే పెళ్లి చేసుకోవాల్సిందే... లేదంటే నిట్టనిలువునా... కాల్చేయడం లేదంటే...మరోరకంగా గాయపర్చడం ..., ప్రస్తుతం యువత ఆలోచనతీరు ఇలా కొనసాగుతోంది. యుక్తవయస్సులో ప్రేమించి అసలు నిజాల్ని తెలుసుకున్న తర్వాత కొంతమంది యువతులు తమ జీవీతాలను మార్చుకునే దిశగా అడుగులు వేస్తున్నారు. అయితే ఇది నచ్చని యువకులు మాత్రం తమకు దక్కనిది ఇంకేవరికి దక్కవద్దనే పెడధోరణి అవలంబిస్తున్నారు. దీంతో ఇన్నాళ్లు ప్రేమించిన అమ్మాయిలనే దారుణంగా కడతేరుస్తున్నారు..
థానే జిల్లాలో సంఘటన
ఇలాంటీ సంఘటనే మహారాష్ట్రాల్లోని థానే జిల్లాలో గురవారం చోటుచేసుకుంది. తనను ప్రేమించిన యువతి మరో యువకున్ని పెళ్లి చేసుందని ఆమెకు పెళ్లైన రెండోరోజే ప్రియురాలిని కత్తిపోట్లకు గురి చేసి తాను హంతకుడిగా మారాడు. థానే జిల్లాలోని వాడోల్ గ్రామానికి చెందిన విశాల్ ఖడే అనే యువకుడు జిల్లాలోని అంబర్ నాథ్ ప్రాంతానికి చెందిన బాధిత యువతి కలిసి కొంత కాలం ప్రేమించుకున్నారు.
పెళ్లికి నిరాకరించిందని కక్ష్య పెంచుకున్న ప్రియుడు
అయితే యువతి ప్రేమ పెళ్లికి ఇంట్లోవారు అంగీకరించపోవడంతో ఆమె మనసు మార్చుకుంది. దీంతో తల్లిదండ్రులు మరో అబ్బాయితో వివాహం చేసేందుకు నిర్ణయించారు. అయినా ప్రేమికుడు తనతో రావాలని కోరాడు. దీంతో నిరాకిరించిన యువతికి గత బుధవారం తల్లితండ్రులు చూసిన యువకునితో పెళ్లి జరిగింది. దీంతో ప్రేమించిన యువకుడు మరింత అగ్రహానికి గురయ్యాడు. ఆమెను హతం చేయాలని కక్ష్యపెంచుకున్నాడు.
ఇంటికి సమీపంలోని యువతికి కత్తిపోట్లు
కాగా పెళ్లయి రెండు రోజులు కావస్తుంది. కొత్త జీవితం కోసం యువతి కళలు కంటున్న తరుణంలో ప్రేమికుడు విశాల్ యువతి ఇంటికి చేరుకున్నాడు. ఆమెతో ఏకంతంగా మాట్లాడాలని పక్కకు తీసుకుని వెళ్లాడు. నమ్మి పక్కకు వెళ్లిన యువతిని అదను చూసి కత్తితో పొడిచి అక్కడినుండి పారిపోయాడు. అయితే సంఘటన ఇంటి అవరణలో జరగడంతో కుటుంబసభ్యులు అప్రమత్తయ్యారు. వెంటనే పెళ్లికూతురుని ఆసుపత్రికి తరలించారు. అయితే ఆమె ప్రాణపాయస్థితి నుండి బయటపడిందని పోలీసులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుడు విశాల్ను అదుపులోకి తీసుకున్నారు.