శ్రీలంక పేలుళ్లలో భారతీయ మహిళ దుర్మరణం! బంధువుల ఇంట్లో శుభకార్యానికి వెళ్లి..!
మంగళూరు: శ్రీలంకలో వరుసగా చోటు చేసుకున్న బాంబు పేలుళ్ల ఘటనల్లో ఓ భారతీయురాలు దుర్మరణం పాలయ్యారు. ఆమెను కర్ణాటకలోని మంగళూరుకు చెందిన రెజీనా ఖాదర్ కుక్కాడి. వయస్సు 58 పంవత్సరాలు. ఆమె స్వస్థలం సూరత్ కల్. మంగళూరు సమీపంలోని బైకంపాడికి చెందిన అబ్దుల్ ఖాదర్ కుక్కాడిని వివాహం చేసుకున్నారు. రెజీనా తన భర్త అబ్దుల్ ఖాదర్ తో కలిసి చాలాకాలం పాటు బైకంపాడిలో నివాసం ఉన్నారు. అనంతరం- కుక్కాడి దంపతులు దుబాయ్ కు వెళ్లిపోయారు.
రెజీనా కుక్కాడి పూర్వీకులు శ్రీలంకకు చెందిన వారు కావడంతో ఆ దేశంలో ఆమెకు పెద్ద సంఖ్యలో బంధువులు, కుటుంబ స్నేహితులు ఉన్నారు. వారిలో చాలామంది కొలంబోలో నివసిస్తున్నారు. బంధువుల ఇంట్లో శుభకార్యానికి హాజరు కావడానికి రెజీనా కుక్కాడి.. శుక్రవారం కొలంబోకు వెళ్లారు.
ఆత్మాహూతి దాడి టార్గెట్ లో భారత రాయబార కార్యాలయం: భద్రత కట్టుదిట్టం
అక్కడి షాంగ్రిలా హోటల్ లో బస చేశారు. ఆమె భర్త అబ్దుల్ ఖాదర్ ఆదివారం నాడు దుబాయ్ నుంచి కొలంబోకు చేరుకోవాల్సి ఉంది. ఆదివారం షాంగ్రిలా హోటల్ పై జరిగిన ఆత్మాహూతి దాడిలో రెజీనా మృత్యువాత పడ్డారు. హోటల్ షాంగ్రిలాపై ఉగ్రవాదిని జెహ్రెయిన్ గా గుర్తించినట్లు శ్రీలంక భద్రతాధికారులు ఇదివరకే ప్రకటించారు. ఐసిస్ ఉగ్రవాద సంస్థకు చెందిన ఆత్మాహూతి దళ సభ్యుడని అధికారులు తేల్చారు.