యువకుడిని వెంటాడి చంపిన వీది కుక్కలు, అధికారుల నిర్లక్షం, పోలీసు కేసు!
బెంగళూరు: మునిసిపాలిటీ అధికారులు, సిబ్బంది నిర్లక్షం కారణంగా వీది కుక్కల దాడిలో యువకుడి ప్రాణాలు గాలిలో కలిసిపోయిన ఘటన కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లా, కారవార పట్టణంలో జరిగింది. వీది కుక్కల దాడిలో ప్రాణాలు రక్షించుకోవడానికి ప్రయత్నించిన యువకుడు చివరికి మృతి చెందాడు.
కారవార పట్టణంలో దీపక్ నాయక్ అలియాస్ శాణే (30) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. నందనగెద్ద ప్రాంతంలో విపరీతంగా వీది కుక్కలు ఉన్నాయి. అటు వైపు పగలు సంచరించాలంటే పిల్లలు, వృద్దులు హడలిపోతారు.
ఆదివారం అర్దరాత్రి దీపక్ నాయక్ సైకిల్ మీద నందనగెద్ద స్మశానవాటికలో మలమూత్రవిసర్జన చెయ్యడానికి వెళ్లాడు. స్మశానవాటికలో దీపక్ నాయక్ మలమూత్రవిసర్జన చేస్తున్న సమయంలో వీది కుక్కలు అక్కడికి వెళ్లి అతని మీద దాడి చేశాయి.
ఒక్కసారిగా గుంపుగా వీది కుక్కలు వచ్చి దాడి చెయ్యడంతో భయంతో సైకిల్ అక్కడే వదిలిపెట్టిన దీపక్ నాయక్ ప్రాణాలు రక్షించుకోవడానికి పరుగు తీశాడు. అయితే వీది కుక్కలు వెంటాడి దీపక్ నాయక్ మీద దాడి చెయ్యడంతో అతని ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి.
వీది కుక్కలు దాడులు చేస్తున్నాయని, వాటిని పట్టుకుని వేరే ప్రాంతంలో వదిలిపెట్టాలని పదేపదే మునిసిపాలిటీ అధికారులకు ఫిర్యాదు చేసినా వారు పట్టించుకోలేదని స్థానికులు ఆరోపించారు. దీపక్ కుటుంబ సభ్యులు ఫిర్యాదు చెయ్యడంతో కారవార పోలీసులు కేసు నమోదు చేశారు.