లాక్డౌన్ ఉన్నా బయట తిరుగుతున్నాడు..: తండ్రిపై కొడుకు ఫిర్యాదు
న్యూఢిల్లీ: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. దేశ ప్రజలందరూ కరోనాను పారద్రోలేందుకు తమ తమ ఇళ్లల్లోనే ఉంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సహకరిస్తున్నారు. అయితే, కొందరు మాత్రం ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తూ సమస్యలు సృష్టిస్తున్నారు.
లాక్డౌన్ అమల్లో ఉన్నా..
లాక్డౌన్ సందర్భంగా అభినందనీయమైన ఘటన ఒకటి చోటు చేసుకుంది. తన తండ్రి లాక్ డౌన్ పాటించడం లేదంటూ కుమారుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటు చేసుకుంది. పశ్చిమ ఢిల్లీలోని రాజోకారి ప్రాంతంలో ఓ 30 ఏళ్ల వ్యక్తి తన కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్నాడు. అయితే, అతడు లాక్ డౌన్ను లెక్క చేయకుండా ప్రతీరోజు రాత్రి 8 గంటలకు బయటకు వెళ్తున్నాడు.
తండ్రిపై కొడుకు ఫిర్యాదు..
ఈ క్రమంలో తన తండ్రి ఎన్నిసార్లు చెప్పినా వినడం లేదంటూ అతని కొడుకు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. యువకుడి ఫిర్యాదు నేపథ్యంలో పోలీసులు అతడి నివాసానికి చేరుకున్నారు. లాక్ డౌన్ అమల్లో వుంది.. ఇంట్లోకి వెళ్లాలని అతడి తండ్రికి చెప్పగా.. వినిపించుకోలేదు. దీంతో కుమారుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు తండ్రిపై పోలీసులు కేసు నమోదు చేశారు. బయట తిరిగితే కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Recommended Video
భారత్లో పెరుగుతున్న పాజిటివ్ కేసులు
ఇది ఇలావుండగా, భారతదేశంలో కరోనావైరస్ వేగంగా వ్యాపిస్తోంది. శనివారం నాటికి దేశంలో 2902కి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య చేరింది. వీరిలో 68 మంది మరణించగా 2650 మంది ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. మరో 184 మంది కొవిడ్-19 నుంచి కోలుకున్నారని కేంద్ర వైద్యారోగ్యశాఖ వెల్లడించింది. ఢిల్లీ నిజాముద్దీన్ ప్రార్థనల్లో పాల్గొన్న వారి కారణంగానే ఇటీవల కాలంలో మనదేశంలో కరోనా కేసులు భారీగా పెరిగాయి. దాదాపు 1000కిపైగా కరోనా కేసులు వీరి వల్లే నమోదు కావడం గమనార్హం. తెలుగు రాష్ట్రాల్లోనూ వందకుపైగా కేసులు నమోదవుతున్నాయి.