ఆధార్ లింకింగ్పై సుప్రీం మధ్యంతర ఉత్తర్వులు నేడు
న్యూఢిల్లీ: ప్రభుత్వం సంక్షేమ పథకాల అమలును ఆధార్ కార్డుతో ముడిపెట్టటాన్ని సవాల్ చేస్తూ దాఖలైన అనుబంధ వ్యాజ్యాలపై మధ్యంతర ఉత్తర్వులను సుప్రీం కోర్టు రాజ్యాంగ ధర్మాసనం శుక్రవారానికి రిజర్వు చేసింది.
గురువారం ఈ అంశంపై దాదాపు మూడు గంటల పాటు కొనసాగిన అనుకూల, వ్యతిరేక వాదనలు వినిన తర్వాత ధర్మాసనం ఈ నిర్ణయాన్ని వెలువరించింది.
ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్ర, జస్టిస్ ఏకే సిక్రీ, జస్టిస్ ఏఎం ఖాన్విల్కర్, జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ అశోక్ భూషణ్ ఈ ధర్మాసనం సభ్యులుగా ఉన్నారు.
అన్ని రకాల సేవలకు ఆధార్ అనుసంధాన గడువును వచ్చే ఏడాది మార్చి 31 వరకూ పెంచుతున్నట్లు కేంద్రం ప్రకటించిన నేపథ్యంలో ప్రధాన పిటిషన్లపై తుది విచారణ జనవరి 17న జరుగుతుందని ధర్మాసనం వెల్లడించింది.
మొబైల్ ఫోన్లతో ఆధార్ అనుసంధాన గడువు వచ్చే ఏడాది ఫిబ్రవరి 6న ముగుస్తుందన్న అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ సూచనను పరిగణనలోకి తీసుకుంటున్నట్లు తెలిపింది.