పోస్టాఫీసులో ‘ఆధార్’ అప్డేషన్... మార్పులు, చేర్పులు నిమిషాల్లో...
ఆధార్ కార్డులో మార్పులు, చేర్పులు, తప్పుల సవరణలు జరగక ఇబ్బంది పడుతున్నారా? ఇక ఆ అవసరం లేదు. సమీప పోస్టాఫీసుకు వెళ్తే సరిపోతుంది. 15 నిమిషాల్లో అప్డేషన్ ప్రక్రియ పూర్తి అవుతుంది.
హైదరాబాద్: ఆధార్ కార్డులో మార్పులు, చేర్పులు, తప్పుల సవరణలు జరగక ఇబ్బంది పడుతున్నారా? ఇక ఆ అవసరం లేదు. సమీప పోస్టాఫీసుకు వెళ్తే సరిపోతుంది. 15 నిమిషాల్లో అప్డేషన్ ప్రక్రియ పూర్తి అవుతుంది.
24 గంటల తర్వాత యూఐడీఏఐ వెబ్సైట్లో ఈ-ఆధార్ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. పక్షం రోజుల్లో ఒరిజనల్ ఆధార్ పోస్టు ద్వారా మీ ఇంటికి వస్తుంది. ఆధార్లో అచ్చు తప్పులు, పొరపాట్లతో ప్రజలు ఇబ్బందులు పడడాన్ని భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ(యూఐడీఏఐ) గుర్తించింది.
ఈ నేపథ్యంలో యూఐడీఏఐ.. తపాలా శాఖతో ఒక ఒప్పందం చేసుకుంది. ఫలితంగా ఆధార్ కార్డుల జారీకి తపాలా శాఖ ముందుకొచ్చింది.
హెడ్ పోస్టాఫీసుల్లో అప్డేషన్ కేంద్రాలు..
రాష్ట్రంలోని హెడ్ పోస్టాఫీసుల్లో ఆధార్ అప్డేషన్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇప్పటికే హైదరాబాద్ పాతబస్తీలోని జూబ్లీ హెడ్ పోస్టాఫీసులో ఏర్పాటు చేసిన ఆధార్ కేంద్రంలో ఈ ప్రక్రియకు శ్రీకారం చుట్టగా, మిగతా పోస్టాఫీసుల్లో ఈ నెల 16 నుంచి ఆధార్ అప్డేషన్ ప్రక్రియ ప్రారంభం కానుంది.
తపాలా శాఖ సిబ్బందికీ శిక్షణ...
సెప్టెంబర్ 1 నుంచి అన్ని సబ్ పోస్టాఫీసుల్లో కేంద్రాలు ప్రారంభించే విధంగా తపాలా శాఖ చర్యలు చేపట్టింది. తపాలా శాఖ సిబ్బందికి ఆధార్ నమోదు, అప్డేషన్పై యూఐడీఏఐ అధికారులచే శిక్షణ కూడా ఇప్పించారు. ప్రధాన పోస్టాఫీసుల్లో త్వరలో ఆధార్ నమోదు కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే బయోమెట్రిక్ డివైజ్ల కోసం చెన్నై కు చెందిన సంస్థతో టెండర్ ప్రక్రియ పూర్తి చేశారు.
అప్డేషన్ కు బయోమెట్రిక్ తప్పనిసరి...
ఆధార్ అప్డేషన్ కోసం బయోమెట్రిక్ తప్పనిసరి. ఆధార్ వివరాల నమోదు అనంతరం ఆథరైజ్డ్ సిబ్బంది, కార్డుదారుడి బయోమెట్రిక్ ఆమోదం అనంతరమే యూఐడీఏఐ ప్రధాన సర్వర్ అప్డేషన్కు అనుమతి ఇస్తుంది. మొబైల్కు వచ్చే వన్టైమ్ పాస్వర్డ్ (ఓటీపీ) ఆధారంగా మార్పులు, చేర్పులు పూర్తి చేస్తారు. అనంతరం అప్డేషన్ ప్రక్రియ పూర్తయినట్లు మొబైల్కు సంక్షిప్త సమాచారం వస్తుంది. ఈ తతంగం 15 నిమిషాల్లో పూర్తవుతుంది. ఆధార్ అప్డేషన్కు రూ.25 వసూలు చేస్తారు. బయోమెట్రిక్కు రూ.25, కొత్తగా ఆధార్ జనరేట్ చేయడానికి రూ.50 వసూలు చేస్తారు.
సద్వినియోగం చేసుకోవాలి...
పోస్టాఫీసులో ఏర్పాటు చేసిన అప్డేషన్ కేంద్రాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తపాలా శాఖ తెలంగాణ సర్కిల్ హైదరాబాద్ హెడ్ క్వార్టర్ రీజియన్ పోస్టుమాస్టర్ జనరల్ పీవీఎస్ రెడ్డి కోరారు. ఆధార్లో మార్పులు, చేర్పులు, సవరణల కోసం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదని, నామమాత్రపు చార్జీలతో ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చని ఆయన వివరించారు.