అంతా భద్రం: ఆధార్ డేటా లీక్పై ఉడాయ్, కేంద్రమంత్రి స్పందన
న్యూఢిల్లీ: ఆధార్ సమాచారం చాలా భద్రంగా ఉందని భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (ఉడాయ్) స్పష్టం చేసింది. పలువురి ఆధార్ కార్డుల వివరాలు, వారి బ్యాంకుల వివరాలకు సంబంధించిన సమాచారం లీకైందని ఓ న్యూస్ వెబ్ సైట్ ప్రచురించిన వార్తపై శనివారం ఉడాయ్ స్పందించింది.
ఆధార్ డేటా సురక్షితంగా ఉందని, ఎలాంటి సమాచారం లీక్ కాలేదని ప్రకటించింది. మీడియా ప్రచురించిన కథనంలో వాస్తవం లేదని తెలిపింది.
దీనిపై కేంద్రమంత్రి కేజే అల్ఫోన్స్ ఆదివారం త్రివేంద్రంలో మాట్లాడుతూ.. అందరి ఆధార్ భద్రంగా ఉందని హామీ ఇస్తున్నామని చెప్పారు. ఆధార్ కార్డులో కేవలం పేరు, అడ్రస్ మాత్రమే ఉంటుందన్నారు. బయో మెట్రిక్ డాటా ఉడాయ్ వద్ద ఉంటుందన్నారు. అది భద్రంగానే ఉందన్నారు.
కాగా, 12 అంకెల ఆధార్ నెంబర్, బ్యాంకుల వివరాలు, ఏయే వాటికి ఆధార్ అనుసంధానం చేసుకున్నారనే దానికి సంబంధించిన వివరాలు బయటకు వచ్చినట్లు ఓ వార్త వచ్చింది. దీంతో ఆధార్ భద్రతపై మరోసారి అనుమానాలు వచ్చాయి. అయితే డేటా లీక్ కాలేదని స్పష్టం చేస్తున్నారు.