ఇక గోవులకూ ఆధార్ తరహా కార్డులు: రూ.148కోట్ల ఖర్చుతో!..
గోవులకు ఆధార్ తరహా కార్డుల కోసం మొత్తం రూ.148కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేస్తున్నారు. పాలియురేథిన్ పై 12అంకెల డిజిట్ ను పొందుపరిచిన ట్యాగులు వాటికి తగిలించనున్నారు.
న్యూఢిల్లీ: దేశంలో గోవుల అక్రమ రవాణా చేస్తున్నారని ఇటీవలి కాలంలో గో సంరక్షక కమిటీ చాలా చోట్ల దాడులకు తెగబడిన సంగతి తెలిసిందే. ఇకనుంచి ఇలాంటి పరిస్థితికి ఫుల్ స్టాప్ పెట్టేలా ఆవులకు కూడా ఆధార్ నంబర్స్ కేటాయించాలని యోచిస్తోంది కేంద్రం.
దేశంలో గోవుల అక్రమ రవాణాను నియంత్రించడానికి ఆధార్ ను పోలిన విశేష గుర్తింపు సంఖ్యను కేటాయించనున్నట్లు సోమవారం సుప్రీంకోర్టుకు తెలియజేసింది. ఈ ప్రతిపాదనలో భాగంగా.. ఆవులకు ఇచ్చే నంబర్ తో పాటు.. వాటి సంతానానికి కూడా నంబర్స్ కేటాయించనున్నారు.
ఇక వదిలేయబడ్డ గోవుల కోసం ప్రతి జిల్లాలో 500సామర్థ్యం కలిగిన గోశాలలను ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర కమిటీ పేర్కొంది. దీనివల్ల వదిలిపెట్టిన గోవుల అక్రమ రవాణాను నిరోధించవచ్చని చెప్పుకొచ్చింది. ఆవు వయసు, జాతి, ఎత్తు, రంగు, కొమ్ముల ఆకారం వంటి అంశాలను పరిగణలోకి తీసుకుని వాటికి గుర్తింపు సంఖ్యను కేటాయిస్తామని తెలిపింది. దేశవ్యాప్తంగా ఈ విధానాన్ని కచ్చితంగా అమలులోకి తీసుకొస్తామని కమిటీ వివరించింది.
కాగా, గుజరాత్ కు చెందిన ఓ దళిత యాక్టివిస్ట్ ఇదే విషయంపై స్పందిస్తూ.. ఆవులకు ఆధార్ తరహా స్పెషల్ ఐడింటిఫికేషన్ కార్డులను ఏర్పాటు చేయాలని కోరడం గమనార్హం. దాంతో పాటు ప్రతి గ్రామంలో గోశాలలను ఏర్పాటు చేసి అవి ప్లాస్టిక్ వ్యర్థాలను తినకుండా చూడాలని కోరారు.
ఇదిలా ఉంటే, గోవులకు ఆధార్ తరహా కార్డుల కోసం మొత్తం రూ.148కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేస్తున్నారు. పాలియురేథిన్ పై 12అంకెల డిజిట్ ను పొందుపరిచిన ట్యాగులు వాటికి తగిలించనున్నారు. ఈ ట్యాగు ఒక్కోటి 8గ్రాముల బరువు ఉంటుందని, ఒక్కోదానికి రూ.8 ఖర్చవుతుందని చెబుతున్నారు. ఇలా ఆధార్ నంబర్ తో గోవులను గుర్తించడం ద్వారా.. వాటి ఆరోగ్య పరిస్థితులను కూడా ఎప్పటికప్పుడు సమీక్షంచవచ్చునని పేర్కొంటున్నారు.