కరోనా విరుగుడు మందు కొనుగోలు చేయలంటే ఆ డాక్యుమెంట్స్ తప్పనిసరి
ముంబై: ఇంట్లో కుటుంబ సభ్యులకు లేదా బంధువులకు కోవిడ్-19 పాజిటివ్గా వచ్చిందా.. అయితే వారికోసం మెడిసిన్స్ కొనాలా..? మెడిసిన్స్ కొనేందుకు మీరు మెడికల్ షాపుకు వెళితే మాత్రం అక్కడ మీ ఆధార్ కార్డు చూపించాల్సిందే. లేదంటే దుకాణాదారుడు మీకు కావాల్సిన కోవిడ్ మెడిసిన్స్ను ఇవ్వడు. ఇదంతా ఎక్కడనుకున్నారా.. మన తెలుగు రాష్ట్రాల్లో అయితే కాదు. మరి ఏ రాష్ట్రమో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.
ఆధార్ తప్పనిసరి
మహారాష్ట్రలో ఆ రాష్ట్ర ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ఒక సర్క్యులర్ జారీ చేసింది. కోవిడ్-19కు సంబంధించి యాంటీ వైరల్ డ్రగ్ రెమ్డెసివిర్, టోసిలీజుమాబ్లాంటి మెడిసిన్స్ కొనుగోలు చేయాలంటే కరోనావైరస్ పేషెంట్ బంధువులు లేదా కుటుంబ సభ్యులు తప్పనిసరిగా వారి ఆధార్ కార్డు చూపించాలని పేర్కొంది. అంతేకాదు డాక్టర్ సూచించిన ప్రిస్క్రిప్షన్ లెటర్తో పాటు కోవిడ్-19 పాజిటివ్ రిపోర్టు కూడా చూపించాకే మందులు కొనుగోలు చేయాలని సర్క్యులర్లో పేర్కొంది. కోవిడ్-19 విరుగుడు మందులను తయారీదారులనుంచి హాస్పిటల్స్ సేకరించిన తర్వాత వాటిని నిల్వ చేస్తున్నాయా లేదా అని ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ శాఖ దర్యాప్తు చేస్తోంది.హాస్పిటల్స్ రెమ్డెసివిర్ మెడిసిన్ను బ్లాకులో అమ్ముతున్నట్లు తమ వద్దకు ఫిర్యాదులు రావడంతో ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు ఆ మహారాష్ట్ర ఎఫ్డీఏ శాఖ మంత్రి రాజేంద్ర షింగేన్ చెప్పారు.
మెడిసిన్ బ్లాక్లో అమ్మకాలు
కోవిడ్-19 యాంటీ వైరల్ డ్రగ్ అవసరం లేనప్పటికీ కొందరు కొనుగోలు చేసి దీన్ని బ్లాక్లో అధిక ధరకు అమ్ముకుంటున్నారన్న ఫిర్యాదులు తమకు అందాయని మంత్రి చెప్పారు. అందుకే ఎవరైతే కోవిడ్-19 మందులు కొనుగోలు చేసేందుకు వస్తారో వారంతా మెడికల్ షాప్ ఓనర్ వద్ద తమ ఆధారు కార్డు సంఖ్య విధిగా చూపించి ఆ తర్వాతే మందులు కొనుగోలు చేయాలనే నిబంధన తీసుకొచ్చినట్లు మంత్రి చెప్పారు. అయితే ఇలాంటి నిబంధనలు పెట్టి పేషెంట్ల బంధువులను ఇబ్బందులు పెట్టరాదని వైద్యులు చెబుతున్నారు.
Recommended Video
మెడిసిన్ కోసం పెరుగుతున్న డిమాండ్
గురువారం సాయంత్రం ఘట్కోపర్లోని ఓ మెడికల్ స్టోర్లో యాంటీ వైరల్ డ్రగ్ కోసం ప్రజలు ఎగబడుతున్నట్లు ఉన్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవగా మంత్రి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఆయనతో పాటు ఫుడ్ అండ్ డ్రగ్ కంట్రోల్ శాఖ అధికారులు కూడా ఉన్నారు. అయితే అక్కడ ఎలాంటి అక్రమాలు జరగలేదని అధికారులు నిర్థారించారు. ప్రస్తుతం ఈ మందులు బాగా పనిచేసినట్లు నివేదికలు వస్తున్న నేపథ్యంలో వీటికి డిమాండ్ బాగా పెరిగిపోయి ఉంటుందని మంత్రి చెప్పారు. రాష్ట్రంలో ఉన్న అన్ని లైసెన్స్ కంపెనీలకు రెమ్డెసివిర్ మందును వేగంగా తయారు చేయాలని ఆదేశాలు ఇచ్చినట్లు మంత్రి రాజేంద్ర చెప్పారు. ఇదిలా ఉంటే ఇప్పటికే 2,100 రెమిడెసివిర్ వయల్స్ సిప్లా కంపెనీ నుంచి గురువారం ముంబై నగరానికి చేరుకోగా... 1600 డోసులు మెడిసిన్ ప్రైవేట్ హాస్పిటల్స్కు తరలించగా.. మిగతావి బీఎంసీ హాస్పిటల్స్కు తరలించినట్లు సమాచారం. ఇక 6వేల వయల్స్ హెటిరో సంస్థ నుంచి గతవారమే బీఎంసీ హాస్పిటల్స్కు చేరాయి.