ఇక పై వీటికి ఆధార్ నెంబరు అవసరం లేదు...చట్టసవరణకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
ఢిల్లీ: మీరు కొత్త బ్యాంక్ అకౌంట్ కోసం వెళుతున్నారా.. లేదా కొత్త మొబైల్ కనెక్షన్ తీసుకోవాలనుకుంటున్నారా... అయితే ఇదివరకు ఆధార్ కార్డు తప్పనిసరిగా ఇవ్వాల్సి ఉండేది. కానీ ఇకపై ఆ అవసరం లేదంటోంది కేంద్రం. ఈ ప్రతిపాదనకు సంబంధించి మోడీ సర్కార్ టెలిగ్రాఫ్ చట్టం, ప్రివెన్షన్ ఆఫ్ మనీలాండరిగ్ చట్టాలను సవరించేందుకు ఓకే చెప్పింది.
సుప్రీంకోర్టు అన్నిటికీ ఆధార్ను అనుసంధానం చేయడంపై సుప్రీం కోర్టు సెప్టెంబర్లో తీర్పు చెప్పింది. సుప్రీంకోర్టు తీర్పును అనుసరించే కేంద్ర ప్రభుత్వం చట్టంలో మార్పులు తీసుకొచ్చేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ చట్టసవరణలను ప్రస్తుతం జరుగుతున్న శీతాకాల సమావేశాల్లోనే ప్రవేశపెట్టాలని కేంద్రం భావిస్తోంది. ఒక్కసారి ఈ సవరణలు ఆమోదం పొందితే బ్యాంకులకు, మొబైల్ ఫోన్ కనెక్షన్లకు ఆధార్ కార్డులు ఇవ్వాలా వద్దా అనేది కస్టమర్ ఇష్టంమేరకే జరుగుతుంది.
ఒకవేళ ఎవరైనా ఆధార్ నెంబర్ ఆధారంగా వ్యక్తిగత విషయాలు లేదా గోప్యతగా వహించాల్సిన విషయాలపై తొంగి చూస్తే వారికి 10 ఏళ్లు జైలుశిక్ష విధించేలా చట్టసవరణ చేయనున్నారు. ఇది ఇప్పటి వరకు మూడేళ్లుగా ఉండేది. ఆదార్ సమాచారం ప్రైవేట్ పార్టీలు తీసుకోవడంపై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తూ సెప్టెంబర్లో ఆధార్ చట్టంలోని సెక్షన్ 57ను కొట్టివేసింది.
టెలిగ్రాఫ్ చట్ట సవరణలో భాగంగా ఒకవేళ కొత్త మొబైల్ కనెక్షన్ కోసం దరఖాస్తు చేసుకుంటే... వెరిఫికేషన్ ప్రాసెస్లో భాగంగా ఆధార్ ఇవ్వాలని కస్టమర్ భావిస్తే దానికి చట్టబద్దమైన మద్దతు కల్పిస్తుంది. కొత్త బ్యాంకు ఖాతా తెరిచేందుకు కేవైసీలో భాగంగా ఆధార్ విధానాలను సరళతరం చేస్తూ ప్రివెన్షన్ ఆఫ్ మనీలాండరింగ్ చట్టంలో సవరణలు తీసుకురానుంది కేంద్ర ప్రభుత్వం. ఒక్క ప్రభుత్వ సంక్షేమ పథకాల విషయంలో తప్ప ఇన్కంటాక్స్ రిటర్న్స్ ధాఖలు , పాన్ నంబర్ కేటాయింపులాంటి వాటికి ఆధార్ అవసరం లేదని సర్వోన్నత న్యాయస్థానం వెల్లడించింది.