అందుకే ఆధార్ విశిష్టమైనది, వ్యక్తిగత స్వేచ్ఛకు అవరోధంకాదు: సుప్రీం కీలక తీర్పు
న్యూఢిల్లీ: ఆధార్ కార్డ్ చట్టబద్ధత మీద సుప్రీం కోర్టు బుధవారం కీలక తీర్పు వెల్లడించింది. జస్టిస్ సిక్రీ తీర్పును చదివి వినిపించారు. ఆయన 40 పేజీల ప్రతిని చదివి వినిపిస్తున్నారు. ఆధార్ చట్టబద్ధతను త్రిసభ్య ధర్మాసనం విచారించింది.
ఆధార్ ఫార్ములాతో సుప్రీం త్రిసభ్య ధర్మాసనం ఏకీభవించింది. డూప్లికేట్ ఆధారా కార్డు తీసుకోవడం అసాధ్యమని చెప్పింది. ఆధార్కు కనీస వ్యక్తిగత డేటా తీసుకుంటున్నారని పేర్కొంది.
ఆధార్ అధికారిక ప్రక్రియను, వ్యక్తిగత సమాచారాన్ని గోప్యంగా ఉంచాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. ప్రభుత్వ సంస్థలు ఆధార్ డేటా షేర్ చేసుకునేందుకు సుప్రీం అనుమతించింది. షేర్ చేసిన డేటాను ఆరు నెలలలోపు తొలగించాలని సూచించింది. ప్రయివేటు సంస్థలకు ఆధార్ డాటా ఇవ్వకూడదని చెప్పింది.
ఒక వ్యక్తికి సంబంధించిన పూర్తి సమాచారం ఇతరుల చేతుల్లోకి వెళ్లకుండా చూడాలని పేర్కొంది. అట్టడుగు వర్గాలకు ఆధార్ సాధికారత కల్పించిందని పేర్కొంది. ఇంటర్నెట్లో ఆధార్ సమాచారం పెట్టవద్దని చెప్పింది. మిగతా గుర్తింపు కార్డులతో పోలిస్తే ఆధార్ విశిష్టమైనదిగా సుప్రీం పేర్కొంది. ఆధార్ ప్రక్రియ స్వచ్చంధంగా కొనసాగాలని పేర్కొంది.
ప్రజాప్రయోజనాల కోసమే ఆధార్ కార్డ్ అని పేర్కొంది. వ్యక్తిగత స్వేచ్ఛకు ఆధార్ అవరోధం కాదని తేల్చి చెప్పింది. అక్రమ చొరబాటుదార్లకు ఆధార్ ఇవ్వవద్దని ప్రభుత్వానికి అత్యున్నత న్యాయస్థానం సూచన చేసింది.
ఆధార్తో నకిలీల సమస్య తొలగిపోయిందని, మరోసారి ఆధార్ నమోదుకు వెళ్తే కంప్యూటర్ గుర్తిస్తుందని, ఇదే ఆధార్ను ప్రత్యేక గుర్తింపుగా చెప్పడానికి కారణమని తెలిపారు. ఆధార్ నమోదుకు ప్రజల నుంచి సాధ్యమైనంత కనీస సమాచారం మాత్రమే తీసుకున్నారని, ఇది పౌరులకు ఏకైక గుర్తింపు కార్డును అందజేసిందన్నారు.
ఆధార్ వల్ల వ్యక్తిగత గోప్యత, హ్యాకింగ్ జరుగుతున్నాయని ప్రధానంగా పిటిషన్ దారులు చెబుతున్నారని, అయితే ఆధార్ డేటా హ్యాకింగ్ చేశారనే వార్తలు అవాస్తవమని ప్రభుత్వం స్పష్టం చేసిందన్నారు. రాష్ట్రాలు సహా ప్రయివేటు కంపెనీలు, మొబైల్ కంపెనీలు ఆధార్ డేటాను కోరడానికి వీల్లేదని తేలిపింది. కోర్టు అనుమతి లేకుండా బయోమెట్రిక్ సమాచారాన్ని ఏ ఏజెన్సీలకు ఇవ్వడానికి వీల్లేదని పేర్కొంది. సుమారు బిలియన్ మందికి పైగా భారతీయులు ఆధార్ నమోదు చేసుకున్నారని కోర్టు గుర్తు చేసింది. మనీ బిల్లుగా ఆమోదించవచ్చునను తెలిపింది.
కాగా, బ్యాంకు ఖాతా మొదలు పాన్కార్డ్, ఫోన్, పాస్పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్ సహా ప్రజలు ఏ సేవ పొందాలన్నా ఆధార్ సంఖ్యను ప్రభుత్వం తప్పనిసరి చేసింది. దీని వల్ల ప్రజల వ్యక్తిగత వివరాలను సేకరించి, డిజిటలీకరించడం వారి వ్యక్తిగత గోప్యతకు గొడ్డలి పెట్టులా పరిణమిస్తుందని, ఈ సమాచారానికి భద్రత లేదని వివరాలు ప్రయివేటు వ్యక్తుల చేతుల్లో చిక్కితే దుర్వినియోగం అయినట్లేనని ఆందోళనలు వ్యక్తమయ్యాయి. వ్యక్తుల వేలి ముద్రలు, కనుపాపలు తదితర బయోమెట్రిక్ సమాచారంతో కూడిన ఆధార్ను తప్పనిసరి చేయరాదని పలువురు వ్యక్తులు, సంస్థల నుంచి 27 పిటిషన్లు దాఖలయ్యాయి. దీనిపై సుప్రీం తీర్పు చెప్పింది.