మరికొన్ని గంటల్లో ఉద్దవ్ పట్టాభిషేకం, సోనియాకు ఆదిత్య ఆహ్వానం, అద్వానీ, మోహన్ భగవత్..
మరికొన్ని గంటల్లో మహారాష్ట్రలో ప్రభుత్వం కొలువుదీరబోతోంది. సీఎంగా శివసేన అధినేత ఉద్దవ్ థాకరే ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఇప్పటికే శివాజీ పార్క్ వద్ద ఏర్పాట్లు పూర్తి కావచ్చాయి. ప్రమాణ స్వీకారం నేపథ్యంలో భారీ భద్రత ఏర్పాటు చేశారు. 2 వేల మంది పోలీసులతో భద్రత కల్పిస్తున్నారు.
పదవుల పందేరం
ప్రభుత్వ ఏర్పాటుచేయబోతున్న కూటమి మహా వికాస్ అఘాడీ (ప్రగతిశీల కూటమి) సమావేశం కాసేపటి క్రితం ముగిసింది. వైబీ చవాన్ సెంటర్ వద్ద జరిగిన సమావేశంలో కాంగ్రెస్ నుంచి అహ్మద్ పటేల్, ఎన్సీపీ నుంచి శరద్ పవార్, సుప్రియ సూలే, శివసేన నుంచి ఉద్దవ్ థాకరే పాల్గొన్నారు. పదవుల పంపకంపై స్పష్టత వచ్చినట్టు తెలుస్తోంది. కూటమికి సంబంధించి అన్ని అంశాలపై చర్చించామని అహ్మద్ పటేల్ పేర్కొన్నారు.
ఒక్కో మంత్రి
గురువారం ప్రమాణం చేసే మంత్రులపై స్పష్టత రాలేదని ఎన్సీపీ నేత ప్రపుల్ పటేల్ తెలిపారు. మూడు పార్టీల నుంచి ఇద్దరు లేదా ముగ్గురు ఎమ్మెల్యేలు ప్రమాణం చేస్తారని చెప్పారు. వారిలో తలా ఒకరు మంత్రి పదవీ చేపడుతారని పేర్కొన్నారు.
వెల్ కం
ప్రమాణ స్వీకార ప్రాంగణం సుందరంగా ముస్తాభైంది. కూటమి ఏర్పాటులో ముఖ్యభూమిక పోషించిన కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీని ఆహ్వానించేందుకు ఆదిత్య థాకరే ఢిల్లీ బయల్దేరి వెళ్లారు. ఢిల్లీలో సోనియాను కలిసి ఆహ్వానించారు. సోనియా ఆశీర్వాదం తీసుకున్నానని ఆదిత్య తెలిపారు. తర్వాత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ను కూడా ఆదిత్య కలిశారు.
మోడీకి కూడా
ప్రమాణ స్వీకార వేడుకకు హాజరుకావాలని ప్రధాని మోదీకి ఉద్దవ్ థాకరే ఆహ్వానం అందజేశారు. మోదీతో ఫోన్లో మాట్లాడిన ఉద్దవ్కు ఈ సందర్భంగా అభినందనలు అందజేసినట్టు సమాచారం. ఈ మేరకు ఆహ్వాన లేఖను ప్రధాని కార్యాలయానికి చేరవేసినట్టు తెలిసింది. ఆహ్వానితుల జాబితాలో రాజ్ థాక్రే కూడా ఉన్నారు.
పోస్లర్ల కలకలం
ఇదిలాఉంటే మరోవైపు అజిత్ పవార్ భావి సీఎం అని పోస్టర్ వెలిసింది. పవార్ సొంత నియోజకవర్గం బారామతిలో అజిత్, శరద్ పవార్తో పోస్టర్ ఉంది. రేపు ఉద్దవ్ ప్రమాణ స్వీకారం చేస్తున్న నేపథ్యంలో ప్లెక్సీ కలకలం రేపుతోంది.