క్రేజీ..కేజ్రీ: ఒర ఒకటే..కత్తులే రెండు: కాంగ్రెస్, బీజేపీ ఓటుబ్యాంకును కొల్లగొట్టిన ఒకే ఒక్కడు.. !
న్యూఢిల్లీ: ఒకే ఒరలో రెండు కత్తులను ఇమిడ్చడం అనేది సాధ్యం కాదని అంటుంటారు పెద్దలు. అలా చేయడం సాధ్యం కాదని కూడా చెబుతుంటారు. దాన్ని సాధ్యం చేసి చూపించారు ఆమ్ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ ప్రస్తుత ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్. భిన్న ధృవాలైన బీజేపీ, కాంగ్రెస్ ఓటు బ్యాంకులను తన వైపు తిప్పుకోగలిగారు. దాని ఫలితమే- ఆయన తాజాగా అందుకున్న ఈ ఘన విజయం. మంగళవారం వెలువడుతున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు..ఢిల్లీ ఓటర్ల విజ్ఙతకు అద్దం పట్టాయి.
సెక్యులర్..నాన్ సెక్యులర్ ఓటు బ్యాంకులు ఆమ్ఆద్మీకే
దేశ రాజకీయాల్లో సెక్యులర్ పార్టీగా ముద్ర ఉన్న కాంగ్రెస్కు. కుల, మత రహితంగా రాజకీయాలను గానీ, పాలనను గానీ అందిస్తుందనే పేరు ఆరంభం నుంచీ ఆ పార్టీకి ఉంది. బీజేపీపై ఉన్న ముద్ర దీనికి పూర్తి భిన్నం. మతతత్వ పార్టీగా గుర్తింపు ఉంది కమలానికి. హిందూ పార్టీగా గుర్తింపు తెచ్చుకుంది. ఈ రెండు పార్టీల ఓటుబ్యాంకులు కూడా వేటికవే భిన్నమైనవి. ఒకటేమో సెక్యులర్ ఓటుబ్యాంకు. మరొకటేమో నాన్ సెక్యులర్ ఓటు బ్యాంకు.. ఈ రెండూ ఒకే పార్టీ వైపు మొగ్గు చూపడం అనేది దేశ రాజకీయాల్లో అత్యంత అరుదు. అలాంటి ఈ రెండు పార్టీల ఓటు బ్యాంకును తన వైపు తిప్పుకొనేలా చేశాడు కేజ్రీవాల్.
అభివృద్ధి.. సంక్షేమ కార్యక్రమాలే ఆలంబనగా..
అరవింద్ కేజ్రీవాల్ వేసిన వ్యూహాలు, చేసిన అభివృద్ధి పనుల వల్లే వరుసగా మూడోసారి ఆయన అధికారంలోకి రావడానికి బాటలు వేశాయని అంటున్నారు విశ్లేషకులు. కనిపించే అభివృద్ధి పనులు చేశారని చెబుతున్నారు. దాని వల్ల కులాలు, మతాల ప్రస్తావన లేకుండా, అలాంటి మాటలనేవే ఢిల్లీ ఓటర్లు చెవికెక్కించుకోలేదనేది తాజాగా వెలువడుతున్న ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి. అరవింద్ కేజ్రీవాల్ చేసిన అభివృద్ధి పనులు, సంక్షేమ కార్యక్రమాల పట్ల ఢిల్లీ ఓటర్లు గంప గుత్తగా ఆకర్షితులయ్యారు.
ఖాతా తెరవని కాంగ్రెస్.. పోటీ ఇవ్వలేకపోయిన కమలం..
వరుసగా మూడుసార్లు హస్తినను పరిపాలించింది కాంగ్రెస్ పార్టీ. షీలా దీక్షిత్ సారథ్యంలో తిరుగులేని మెజారిటీని సాధిస్తూ హ్యాట్రిక్ విజయాలను నమోదు చేసింది. ఏ ఢిల్లీలో అయితే కాంగ్రెస్ పార్టీ వరుసగా మూడుసార్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగిందో.. అదే ఢిల్లీలో ప్రస్తుతం ఒక్క స్థానాన్ని కూడా తెరవలేకపోయింది. దీనికి ప్రధాన కారణం- ఓటు బ్యాంకే. తన ఓటుబ్యాంకు మొత్తాన్నీ ఆమ్ ఆద్మీ పార్టీకి కోల్పోయింది కాంగ్రెస్ పార్టీ. దాని ఫలితంగా కనీసం ఖాతా తెరవలేని దుస్థితికి చేరుకుంది.
బీజేపీ మాటేమిటీ?
బీజేపీ పరిస్థితీ అంతే. కాంగ్రెస్తో పోటీ పడేలా ఉంది. తన ఓటు బ్యాంకును కూడా పూర్తిగా ఆమ్ఆద్మీకి కోల్పోయినట్టే కనిపిస్తోంది. 2015 నాటి ఎన్నికల్లో మూడు స్థానాలకే పరిమితమైంది కమలం పార్టీ. అయిదేళ్ల తరువాత పట్టుమని పది స్థానాలను కూడా అదనంగా రాబట్టుకోలేకపోయింది. దీన్ని బట్టి చూస్తే.. బీజేపీ కూడా ఏ స్థాయిలో తన ఓటుబ్యాంకును కోల్పోయిందో అర్థం చేసుకోవచ్చు. బీజేపీకి కూడా ఇదివరకు ఢిల్లీని పరిపాలించిన అనుభవం ఉంది. అనుభవజ్ఙులైన నాయకులు ఉన్నారు. కేంద్రంలో అధికారంలో కొనసాగుతోంది. అయినప్పటికీ.. తన ఓటుబ్యాంకును మాత్రం కాపాడుకోలేకపోయింది.