గంటకు ఓ ఫోన్ మార్చుతున్న మాజీ మంత్రి
న్యూఢిల్లీ: గృహహింస, హత్యాయత్నం ఆరోపణలు ఎదుర్కోంటున్న మాజీ మంత్రి, ఢిల్లీ శాసన సభ్యుడు సోమనాథ భారతీ ఎక్కడ ఉన్నా తప్పకుండా అదుపులోకి తీసుకుని విచారణ చేస్తామని ఢిల్లీ సీనియర్ పోలీసు అధికారి దీపేందర్ పాఠక్ చెప్పారు.
ఆయన గంటకు ఓ ఫోన్ నెంబర్ మార్చుతున్నారని, అదే విదంగా ఆయన ఉంటున్న చోటును మారుతున్నారని తాము గుర్తించామని అన్నారు. ఆయన మాజీ మంత్రి, ఓ శాసన సభ్యుడు, అయితే కరుడుకట్టిన నేరస్తుడిలాగా ప్రవర్థిస్తున్నాడని చెప్పారు.
ఎంత తప్పించుకు తిరుగుతున్నా ప్రస్తుతం ఆయన ఉన్న చోటు విషయంలో మాకు ఒక అవగాహన ఉందని అన్నారు. ఆగ్రా ప్రాంతంలోని సోమనాథ భారతీ తలదాచుకున్నారని తమ వద్ద సమాచారం ఉందని తెలిపారు.
ఆయన ఉన్న చోటకు తాము వెళ్లి విచారణ చేస్తాం అని పోలీసు అధికారి దీపేందర్ పాఠక్ అన్నారు. తనను చిత్ర హింసలకు గురి చేశాడని, రెండు సార్లు హత్యాయత్నం చేశాడని, ఆయన పెంపుడు కుక్క డాన్ తో దాడి చేయించాడని సోమనాథ భారతీ భార్య లిపిక మిత్రా పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కేసు నమోదు అయిన నేపద్యంలో సోమనాథ భారతీ మంత్రి పదవి ఊడిపోయింది. పలు సార్లు పోలీసులు ఆయనను విచారణ చేశారు. చివరికి బెయిల్ రద్దు కావడం, హై కోర్టు బెయిల్ ఇవ్వడానికి నిరాకరించడంతో సోమనాథ భారతీ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.