కేజ్రీవాల్ కుటుంబంలో డబుల్ హ్యాపీ: భార్య పుట్టినరోజు కానుకగా ఢిల్లీ విజయం
న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ఆద్మీ పార్టీ వరుసగా మూడోసారి విజయాన్ని సాధించడం ఒక ఎత్తయితే.. ఫలితాలు వెలువడిన రోజే ఆమ్ఆద్మీ పార్టీ అధినేత, ప్రస్తుత ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ భార్య సునీతా కేజ్రీవాల్ పుట్టినరోజు కావడం మరో ఎత్తు. అందుకే- అరవింద్ కేజ్రీవాల్ ఆనందం రెట్టింపయిందని చెబుతున్నారు పార్టీ నాయకులు. ఒకవంక ఓట్ల లెక్కింపు ఫలితాలు వెలువడుతున్న కొద్దీ.. పార్టీ నేతల సంతోషానికి ఆకాశమే హద్దుగా నిలిచింది.
ఐఆర్ఎస్ అధికారిణిగా..
సునీతా కేజ్రీవాల్.. మాజీ ఐఆర్ఎస్ అధికారిణి. 1993 ఇండియన్ రెవెన్యూ సర్వీసెస్కు చెందిన ఆమె పలు కీలక స్థానాల్లో పనిచేశారు. 2016లో స్వచ్ఛందంగా పదవీ విరమణ చేశారు. పదవీ విరమణ చేయడానికి ముందు ఆమె న్యూఢిల్లీ ఆదాయపు పన్ను శాఖ కమిషనర్గా, ట్యాక్ అప్పిలేట్ ట్రైబ్యునల్లో పనిచేశారు. అంతకుముందే- తన భర్త రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన నేపథ్యంలో.. తన హోదాకు స్వచ్ఛందంగా పదవీ విరమణ చేశారు. రాజకీయాల్లోకి రాకముందు అరవింద్ కేజ్రీవాల్ కూడా ఐఆర్ఎస్ అధికారే.
పుట్టినరోజు నాడే ఫలితాల వెల్లడితో ఆనందం రెట్టింపు..
ఫిబ్రవరి 11 సునీత కేజ్రీవాల్ పుట్టినరోజు. అదేరోజు ఎన్నికల ఫలితాలు వెలువడుతుండటం.. పార్టీని అధికారం చేపట్టబోతుండటం కేజ్రీవాల్ కుటుంబంలో ఆనందాన్ని రెట్టింపు చేసినట్టయింది. ఆమ్ఆద్మీ పార్టీకి చెందిన పలువురు మహిళా నాయకులు కేజ్రీవాల్ ఇంటికి బారులు తీరారు. సునీతా కేజ్రీవాల్కు అభినందనల్లో ముంచెత్తుతున్నారు. వందలాది మంది పార్టీ నాయకులు, కార్యకర్తలు కేజ్రీవాల్ ఇంటి ముందు సంబరాలు జరుపుకొంటున్నారు.
పార్టీ కార్యాలయానికి సునీతా కేజ్రీవాల్..
ఫలితాలు ఆరంభం అయ్యేంత వరకూ కేజ్రీవాల్.. తన నివాసంలో గడిపారు. ఓట్ల లెక్కింపు ట్రెండ్ పార్టీకి అనుకూలంగా రావడం, దాదాపుగా ఏకపక్షం అవుతుండటంతో ఇంటి నుంచి పార్టీ కార్యాలయానికి బయలుదేరి వెళ్లారు. సాయంత్రం 4 గంటలకు అరవింద్ కేజ్రీవాల్ విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు సమాచారం అందింది. సునీతా కేజ్రీవాల్ కూడా పార్టీ కార్యాలయానికి వస్తారని, విజయోత్సవాల్లో పాల్గొంటారని పార్టీ నాయకులు చెబుతున్నారు.
Recommended Video
కంఫర్టబుల్ విక్టరీ..
కాగా- ఫలితాలు గడుస్తున్న కొద్దీ వెలువడుతున్న ఫలితాలన్నీ ఆమ్ఆద్మీ పార్టీకి అనుకూలంగా ఉంటూ వచ్చాయి. మధ్యలో బీజేపీ అభ్యర్థులు గట్టి పోటీ ఇచ్చినప్పటికీ.. అది తాత్కాలికమే అయింది. తొలి మూడు గంటల తరువాత ఆమ్ఆద్మీ పార్టీ సుమారు 54 సీట్ల మార్క్ను అందుకుంది. అదే సమయంలో బీజేపీ 16 స్థానాలకే పరిమితమైపోయి కనిపించింది. మూడోవంతు సీట్లను ఆమ్ఆద్మీ పార్టీ సొంతం చేసుకోవడంతో ప్రభుత్వ ఏర్పాటు ఖాయమైనట్టే.