ఆప్ ఎంఎల్ఏపై చీటింగ్: భూ అక్రమణ కేసు
న్యూఢిల్లీ: అమ్ ఆద్మీ పార్టీ శాసన సభ్యుల అక్రమాలు రోజుకు ఒకటి బయటకు వస్తున్నాయి. శాసన సభ్యుల వ్యవహారాలతో ఆ పార్టీ రోజుకొక వివాదంలో చిక్కకుంటున్నది. ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన ఓ శాసన సభ్యుడి మీద ఢిల్లీ పోలీసులు చీటింగ్, భూ అక్రమణ కేసు నమోదు చేశారు.
పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ఢిల్లీలోని కొండ్లి శాసన సభ నియోజక వర్గం ఎంఎల్ఏ మనోజ్ కుమార్(26) తన వ్యాపార భాగస్వామి అయిన వినోద్ కుమార్ కు రూ. 6 లక్షల మేర మోసం చేశారని చీటింగ్ కేసు నమోదు చేశారు.
భూమికి సంబంధించి వీరిద్దరి మధ్య చాల కాలం నుండి వివాదం నడుస్తోందని ఢిల్లీ నగర పోలీసు కమిషనర్ బీఎస్ బస్సీ తెలిపారు. తూర్పు ఢిల్లీలోని న్యూ అశోక్ నగర పోలీస్ స్టేషన్ కు మనోజ్ కుమార్ ను పిలిపించి విచారణ చేశామని ఆయన అన్నారు.
మనోజ్ కుమార్ ను ప్రస్తుతం విచారణ చేస్తున్నామని బీఎస్ బస్సీ తెలిపారు. 2012 నవంబర్ నెలలో ఓ ఫ్లాట్ కొనుగోలు చెయ్యడానికి తాను తన భాగస్వామి మనోజ్ కుమార్ కు రూ. 6 లక్షలు ఇచ్చానని వినోద్ కుమార్ ఆరోపించారు.
ఆ నగదు తిరిగి ఇవ్వలేదని, భూమిని కొనుగోలు చెయ్యకుండా ఆక్రమించుకున్నాడని వినోద్ కుమార్ ఆరోపించారు. ఎంఎల్ఏ మనోజ్ కుమార్ రాజకీయాలలోకి రాకముందు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవాడు. అయితే మనోజ్ కుమార్ ను పోలీసులు అరెస్టు చేశారని వార్తలు గుప్పుమన్నాయి.