బీజేపీపై రూ.2,500 కోట్ల స్కాం : సీబీఐ విచారణకు ఆప్: అధికార పక్షంలో ఉంటూ అసెంబ్లీలో ధర్నా
న్యూఢిల్లీ: ఢిల్లీలో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సారథ్యంలోని ఆమ్ ఆద్మీ పార్టీ.. బీజేపీపై ఘాటు ఆరోపణలను గుప్పించింది. బీజేపీ నేతలు 2,500 కోట్ల రూపాయల మేర కుంభకోణాలకు పాల్పడ్డారని విమర్శించింది. దీనిపై సీబీఐ విచారణకు ఆదేశించాలని పట్టుబట్టింది. అధికార పార్టీ అయ్యుండీ.. అసెంబ్లీలో నిరసన ప్రదర్శనలను నిర్వహించింది. ప్లకార్డులు, బ్యానర్లను ప్రదర్శించింది. దీనిపై బీజేపీ నేతలు వివరణ ఇవ్వాలని పట్టుబట్టింది.
కొత్త సీఎస్ ఎవరు?: సీనియర్లు వీరే: కేబినెట్ భేటీలో చర్చ: నీలం సాహ్నీకి వైఎస్ జగన్ సన్మానం
మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ (ఎంసీడీ)లో పెద్ద ఎత్తున నిధుల దుర్వినియోగానికి బీజేపీ పాల్పడినట్లు ఆమ్ ఆద్మీ పార్టీ శాసన సభ్యులు ఆరోపించారు. శాసనసభ శీతాకాల సమావేశాల రెండోరోజు వారు సభకు ఆప్ సభ్యులు ప్లకార్డులు, బ్యానర్లను తమ వెంట తెచ్చుకున్నారు. సభలో వాటిని ప్రదర్శించారు. 2,500 కోట్ల రూపాయల కుంభకోణానికి బీజేపీ నేతలు పాల్పడ్డారని ఆరోపించారు. దీనిపై సీబీఐ విచారణ జరిపించాలని నినదించారు. ఆప్ ఎమ్మెల్యే నినాదాలతో అసెంబ్లీ మారుమోగిపోయింది.
అధికార పార్టీ సభ్యులను స్పీకర్ వారించడానికి ప్రయత్నించినప్పటికీ.. వినిపించుకోలేదు. బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలను కొనసాగించారు. ప్లకార్డులను ప్రదర్శిస్తూ పోడియం వైపు దూసుకెళ్లారు. నినాదాలు చేశారు. వారిని అడ్డుకోవడానికి బీజేపీ సభ్యులు ప్రయత్నించడంతో సభలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. దీనితో స్పీకర్ సభను 15 నిమిషాల పాటు వాయిదా వేశారు. సభ పునఃప్రారంభమైన తరువాత కూడా అవే దృశ్యాలు కనిపించాయి.
ఢిల్లీ అసెంబ్లీలో బీజేపీకి ఉన్న ప్రాతినిథ్యం నామమాత్రమే. 70 స్థానాలు ఉన్న ఢిల్లీ అసెంబ్లీలో ఆ పార్టీకి ఎనిమిది మంది సభ్యుల బలం మాత్రమే ఉంది. ఢిల్లీ పరిధిలో ఉన్న ఏడు లోక్సభ స్థానాలను కూడా బీజేపీ కైవసం చేసుకుంది. బీజేపీ ఎంపీలందరూ కుమ్మక్కయ్యారని, ఢిల్లీ మున్సిపాలిటీపై పెత్తనం చలాయించడానికి ప్రయత్నిస్తున్నారనేది ఆమ్ ఆద్మీ పార్టీ నేతల ఆరోపణ. మున్సిపాలిటీకి కేటాయించాల్సిన నిధులను దుర్వినియోగం చేశారని విమర్శిస్తున్నారు.