ఢిల్లీ బాద్షా మళ్లీ కేజ్రీవాలే: ఆప్కు మెజార్టీ స్థానాలు.. ఎగ్జిట్ పోల్స్ అన్నీ సామాన్యుడి వైపే..!
ఢిల్లీ: ఢిల్లీ ఎన్నికలకు పోలింగ్ ముగిసింది. ఎగ్జిట్ పోల్స్ క్రమంగా రావడం మొదలయ్యాయి.ఎగ్జిట్ పోల్స్ అన్నీ అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ వైపే ప్రజలు మొగ్గు చూపారని చెబుతున్నాయి. ఢిల్లీని ఆమ్ ఆద్మీ పార్టీ క్లీన్ స్వీప్ చేస్తుందని ఎగ్జిట్ పోల్స్ అంచనావేశాయి. ప్రస్తుతం ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు హల్చల్ చేస్తున్నాయి.
ఢిల్లీ బాద్షా అరవింద్ కేజ్రీవాల్
ఢిల్లీలో మళ్లీ ఆమ్ ఆద్మీ పార్టీకే ప్రజలు పట్టంకట్టబోతున్నారని ఎగ్జిట్ పోల్స్ జోస్యం చెబుతున్నాయి. దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ ఏకపక్షంగా ఆప్ వైపే మొగ్గు చూపాయి. లోక్సభ ఎన్నికల్లో ఢిల్లీలోని మొత్తం ఏడు సీట్లు సాధించిన బీజేపీ.. అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం ఆ స్థాయి ప్రదర్శన చూపించలేకపోయింది. లోక్సభ ఎన్నికల తర్వాత ఢిల్లీలో చోటుచేసుకుంటున్న పరిణామాలు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వివాదాస్పద చట్టాలపై ప్రజలు ఒక్కింత విసుగు చెంది ఉన్నారని విశ్లేషకులు చెబుతున్నారు.
ఆప్కు మెజార్టీ స్థానాలు
ఇక ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎగ్జిట్ ఫలితాలను పరిశీలిస్తే న్యూస్ ఎక్స్ పోల్స్ట్రాట్ అరవివింద్ కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీకి 52 నుంచి 56 సీట్ల వరకు వస్తాయని అంచనా వేసింది. బీజేపీకి 10 నుంచి 14 స్థానాలు వస్తాయని జోస్యం చెప్పింది. ఇక కాంగ్రెస్ 0-2 సీట్లతో సరిపెట్టకుంటుందని వెల్లడించింది. ఇక ఇండియా న్యూస్ నేత సంస్థ కేజ్రీవాల్ పార్టీకి 53 నుంచి 57 సీట్లు వస్తాయని చెప్పగా... బీజేపీకి 11 నుంచి 17 సీట్లు కాంగ్రెస్కు 0-2 సీట్లు వస్తాయని పేర్కొంది.
ప్రచారంలో హుందాతనంతో ఆకట్టుకున్న ఢిల్లీ సీఎం
ఇక ఎన్నికల షెడ్యూల్ విడుదల అయినప్పటి నుంచే ఢిల్లీలో ఎన్నికల హీట్ పెరిగింది. అంతా అనుకుంటున్నట్లుగానే ఆమ్ ఆద్మీ పార్టీ వైపే ప్రజలు మొగ్గు చూపారనేది స్పష్టమవుతోంది. ఇక ప్రీపోల్ సర్వేలు కూడా ఆమ్ ఆద్మీ పార్టీకే ప్రజలు అనుకూలంగా ఉన్నారని చెప్పాయి. ఇక ముందు నుంచి కూడా అరవింద్ కేజ్రీవాల్ తనదైన హుందాతనంను మెయిన్టెయిన్ చేస్తూ ఎక్కడా వివాదాలకు తావు ఇవ్వకుండా ప్రచారం చేయడమే ఆమ్ ఆద్మీ పార్టీకి కలిసొచ్చిందని విశ్లేషకులు చెబుతున్నారు.
కేజ్రీవాల్ సంక్షేమ పథకాలు హిట్
ఇదిలా ఉంటే 2015లో ఢిల్లీ అసెంబ్లీకి 67శాతం పోలింగ్ నమోదు కాగా... ఈ సారి మాత్రం 55శాతం మాత్రమే పోలింగ్ నమోదు కావడం విశేషం. ఇక ఎగ్జిట్ పోల్స్ ప్రకారం ఢిల్లీ ప్రజలు తిరిగి అరవింద్ కేజ్రీవాల్కే పట్టం కట్టారని ఎక్కడా వ్యతిరేకత అనేది లేకుండా స్పష్టమైన మెజార్టీ ఇవ్వబోతున్నారని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ ప్రజా తీర్పుతో కేజ్రీవాల్ మళ్లీ ఢిల్లీ బాద్షాగా నిలిచారు. ఇక కేజ్రీవాల్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, ఢిల్లీకి మంచి నీటి సరఫరా, విద్యుత్, విద్యకు ఇచ్చిన ప్రాధాన్యం అతన్ని మళ్లీ కింగ్ను చేశాయని అనలిస్టులు అభిప్రాయపడుతున్నారు.