ఫేక్ ఇంటర్వ్యూ: పాక్ వెబ్సైట్లకు అమీర్ లీగల్ నోటీసులు
ముంబై: ఫేక్ ఇంటర్వ్యూ ప్రచురించారనే ఆరోపణపై బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్ పాకిస్తాన్లోని కొన్ని వెబ్సైట్లకు నోటీసులు పంపించారు. తన తాజా చిత్రం పికె విడుదల నేపథ్యంలో మతంపై అమీర్ ఖాన్ ఇంటర్వ్యూ ఇచ్చినట్లు పాకిస్తాన్లోని కొన్ని వెబ్సైట్లు తప్పుడు ఇంటర్వ్యూలు ప్రచురించాయి.
అమీర్ ఖాన్ తరఫున డిఎస్కె లీగల్ మేనేజింగ్ పార్ట్నర్ ఆనంద్ దేశాయ్ పాకిస్తాన్ వెబ్సైట్లకు నోటీసులు పంపించారు. అమీర్ ఖాన్ ఇంటర్వ్యూ ఇచ్చినట్లు తప్పుడుగా ఆపాదించారని ఆయన అన్నారు. ఇటీవలి పికె సినిమా విడుదల నేపథ్యంలో పలు పాకిస్తాన్ వెబ్సైట్లు అమీర్ ఖాన్ ఇంటర్వ్యూ ఇచ్చినట్లుగా ఆపాదిస్తూ ప్రచురించాయని ఆయన చెప్పారు.
ఆ విధమైన ఇంటర్వ్యూ అమీర్ ఖాన్ ఎప్పుడూ ఇవ్వలేదని స్పష్టం చేశారు. అమీర్ ఖాన్గా చెప్పుకుని ఎవరో తారుమారు చేసి ఉంటారని, తమ వెబ్సైట్లకు సందర్శకులను పెంచుకునేందుకు అలా చేసి ఉంటారని, తమ క్లయింట్ పరువుకు నష్టం కలిగించారని ఆయన అన్నారు.
ఈ రోజు తాము అమీర్ ఖాన్ తరఫున వెబ్సైట్లకు లీగల్ నోటీసులు పంపించామని, తమ క్లయింట్ హక్కులకు భంగం కలిగించారని ఆయన అన్నారు. ముంబై క్రైమ్ సెల్ పోలీసులకు అమీర్ ఖాన్ ఫిర్యాదు చేస్తారని చెప్పారు. ముంబైకి వచ్చిన తర్వాత అమీర్ ఖాన్ ఫిర్యాదు చేస్తారని దేశాయ్ చచెప్పారు. అమీర్ ఖాన్ ప్రస్తుతం అమెరికాలో ఉన్నారు.