సల్మాన్ఖాన్, జయలలితలకేకాదు అమీర్ఖాన్కు, భార్యకు ఊరట
అహ్మదాబాద్: గత కొద్ది రోజులుగా తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత, ప్రముఖ బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ కోర్టు కేసుల గురించి మీడియాలో పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. రెండు రోజుల క్రితం సల్మాన్ ఖాన్కు, సోమవారం నాడు జయలలితకు కోర్టు నుండి ఊరట లభించింది. అదే సమయంలో మరో ప్రముఖ బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్కు కూడా కోర్టు నుండి ఊరట లభించింది.
అమీర్ ఖాన్కు శుక్రవారం నాడు (మే 8)న గుజరాత్ హైకోర్టులో ఊరట లభించింది. అమీర్ ఖాన్తో పాటు మరో నలుగురి పైన నమోదైన కేసును కోర్టు కొట్టివేసింది. అమీర్ ఖాన్, ఆయన భార్య రీనా దత్తో పాటు మరో ముగ్గురి పైన ఈ కేసు వేశారు. దీని నుండి వారికి విముక్తి లభించింది.
లగాన్ చిత్రం షూటింగ్ సమయంలో వీరు 'చింకారా' అనే జంతువును చంపేసినట్లుగా కేసు దాఖలైంది. ఓ ఫారెస్ట్ అధికారి ఈ కేసు దాఖలు చేశారు. అనంతరం ఆర్టీఐ కార్యకర్త అమిత్ జెథవా ద్వారా ఈ కేసు భుజ్ కోర్టుకు వచ్చింది.
అనంతరం సదరు ఆర్టీఐ కార్యకర్తను 2010లో మైనింగ్ మాఫియా హత్య చేసింది. అతనిని జునాగఢ్ జిల్లాలో చంపింది.
ఇదిలా ఉండగా, జంతువు హత్యకు సంబంధించి అమీర్ ఖాన్ తరఫు న్యాయవాది మాట్లాడుతూ... అక్కడ చిత్రాన్ని తీయడం మినహా జంతువును చంపారనేందుకు ఎలాంటి ఆధారాలు లేవని కోర్టుకు చెప్పారు. ఎవరి పైన కేసు నమోదు చేసేముందు ఆధారాలు ఉండాలన్నారు. అక్కడ చిత్రం తీయడం మినహా మరే ఆధారం లేదని చెప్పారు.
కాగా, 2002 హిట్ అండ్ రన్ కేసులో సల్మాన్ ఖాన్కు జైలు శిక్ష పడగా.. ఇటీవల కోర్టులో అతనికి ఊరట లభించింది. మరోవైపు, అక్రమాస్తుల కేసులో జయలలితకు కోర్టు నాలుగేళ్ల జైలు శిక్ష, వంద కోట్ల రూపాయల జరిమానా విధించింది. దీనిపై జయలలిత హైకోర్టులో అప్పీల్ చేశారు. హైకోర్టు ఆమెను నిర్దోషిగా తేల్చింది.