చేతులు కాలాక ఆకులు పట్టుకున్న కాంగ్రెస్: పొత్తు కోసం ఆప్ తో సంప్రదింపులు: మిగిలింది ఒక్క స్థానమే
న్యూఢిల్లీ: చేతులు కాలిపోయాక ఆకులు పట్టుకున్నట్లుగా తయారైంది కాంగ్రెస్ పార్టీ పరిస్థితి. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయడానికి ఆమ్ ఆద్మీ పార్టీ లోక్ సభ ఎన్నికల అభ్యర్థులను కూడా ప్రకటించిన తరువాత.. ఆ పార్టీతో పొత్తు కోసం ప్రయత్నాలు మొదలు పెట్టింది. న్యూఢిల్లీ పరిధిలో మొత్తం ఏడు లోక్ సభ స్థానాలు ఉండగా.. శనివారం నాడే ఆరు సీట్లకు అభ్యర్థులను ప్రకటించారు ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్.
ఆయా అభ్యర్థులందరూ ప్రస్తుతం ఎన్నికల ప్రచారానికి దిగుతున్నారు కూడా. ఇలాంటి సమయంలో ఆ పార్టీతో సీట్ల సర్దుబాటు కోసం కాంగ్రెస్ చర్చలకు కూర్చోబోతోంది. ఈ అంశంపై మంగళవారం మధ్యాహ్నం ఢిల్లీలో కాంగ్రెస్-ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు సమావేశం కాబోతున్నారు.
ఉన్న ఏడు స్థానాల్లో ఆరింట్లో అభ్యర్థులను ప్రకటించిన తరువాత సీట్ల సర్దుబాటు కోసం కాంగ్రెస్ ప్రయత్నిస్తుండటం రాజకీయ అపరిపక్వతకు నిదర్శనమనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఈ చర్చలు ఫలిస్తే.. మిగిలిన ఆ ఒక్క స్థానాన్ని కాంగ్రెస్ కు కేటాయించడానికి తమకేమీ అభ్యంతరం లేదని ఆప్ సీనియర్ నాయకులు చెబుతున్నారు. తమ రెండు పార్టీల రాజకీయ శతృవు ఒక్కడే కావడం వల్ల ఉమ్మడిగా ఎదుర్కుంటామని అంటున్నారు.
శనివారం ఆమ్ ఆద్మీ పార్టీ ప్రకటించిన జాబితా ప్రకారం.. అతిషి-ఈస్ట్ ఢిల్లీ, గూగన్ సింగ్-నార్త్ వెస్ట్, రాఘవ్ ఛడ్డా-సౌత్ ఢిల్లీ, దిలీప్ పాండే-నార్త్ ఈస్ట్, పంకజ్ గుప్తా-చాందినీ చౌక్, బ్రిజేష్ గోయల్-న్యూఢిల్లీ సీట్లో పోటీ చేయబోతున్నారు. ఎన్నికల ప్రచారంలో కూడా పాల్గొంటున్నారు. ఇక మిగిలిన వెస్ట్ ఢిల్లీ లోక్ సభ స్థానంలో అభ్యర్థిని ఇంకా ప్రకటించాల్సి ఉంది. ఈ దశలో కాంగ్రెస్ పార్టీ పొత్తు ప్రయత్నాలకు దిగింది.
మంగళవారం మధ్యాహ్నం ఈ రెండు పార్టీల సీనియర్ నాయకులు చర్చల్లో పాల్గొనబోతున్నారు. సీట్ల సర్దుబాటు కుదిరితే వెస్ట్ ఢిల్లీ లోక్ సభ సీటును ఆప్.. కాంగ్రెస్ కు వదిలి పెడుతుంది. మిగిలిన లోక్ సభ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ.. అభ్యర్థులను బరిలో దింపదు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా మూడుసార్లు ముఖ్యమంత్రి స్థానాన్ని నిలబెట్టుకున్న కాంగ్రెస్ పార్టీ.. అదే ఢిల్లీలో ఒక్క లోక్ సభ స్థానంతో సరిపెట్టుకుంటుందా? అనేది ఆసక్తికర అంశం.