ఆప్ మహిళా కౌన్సిలర్ను జుట్టుపట్టి ఈడ్చుకొచ్చిన పోలీసులు: అరెస్ట్
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ కౌన్సిలర్ నిషా సింగ్ను ఢిల్లీకి సమీపంలోని గుర్గావ్ పోలీసులు జుట్టు పట్టి బయటకు ఈడ్చుకొచ్చి, కొట్టి మరీ అరెస్ట్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. గూగుల్ సంస్థలో పని చేసిన ఆమె, ఆప్ విధానాలకు ఆకర్షితురాలై ఆ ఉద్యోగానికి రాజీనామా ఇచ్చి రాజకీయాల్లోకి వచ్చారు.
శుక్రవారం నాడు హర్యానా అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కార్యాలయం ముందు జరిగిన హింసాత్మక ఘటనతో సంబంధముందని ఆరోపిస్తూ, పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా, ఆమెను అరెస్ట్ చేసేముందు పోలీసులు అనుచితంగా ప్రవర్తించారని ఆప్ కార్యకర్తలు ఆరోపించారు.
శుక్రవారం నాటి ఘర్షణల్లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలున్నా వారిని చూసీ చూడనట్లుగా వదిలేశారని, తనకు తగిలిన గాయాలకు నిషా సింగ్ చికిత్స చేయించుకుని ఆస్పత్రి నుంచి వస్తుంటే అరెస్ట్ చేశారని, అనుచితంగా ప్రవర్తించిన పోలీసులపై తక్షణం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఇది ఇలా ఉండగా, ఈ అల్లర్ల కేసులో నిషాతోపాటు మరో 9మంది మహిళలపై హత్యాయత్నం కేసులను నమోదు చేశారు పోలీసులు. అరెస్ట్ అనంతరం నిషాను న్యాయమూర్తి ఎదుట హాజరుపర్చగా, రిమాండ్ విధించడంతో ఆమెను భోండ్సీ జైలుకు తరలించారు.