కాంగ్ మద్దతు: ఢిల్లీ కొత్త సిఎం కేజ్రీవాల్, 26న ప్రమాణం
న్యూఢిల్లీ: కాంగ్రెసు పార్టీ మద్దతుతో తాము న్యూఢిల్లీలో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్ సోమవారం ప్రకటించారు. ఉదయం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తాము ఈ నెల 26న ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు. కాసేపట్లో లెఫ్టినెంట్ గవర్నర్ను కలుస్తామని చెప్పారు.
ప్రజాభిప్రాయం మేరకే తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. తాము సేకరించిన ప్రజాభిప్రాయ సేకఱణలో ఏడు లక్షల మంది ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని కోరారని తెలిపారు. కాంగ్రెసు పార్టీకి చెందిన ఎనిమిది మంది శాసన సభ్యుల మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్నారు.
ముఖ్యమంత్రి అభ్యర్థి కేజ్రీవాల్
ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి నిర్ణయించుకోవడంతో ఎఎపి పార్టీ అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎన్నకున్నారు. అతను ఢిల్లీ అసెంబ్లీ నియోజకవర్గం నుండి షీలా దీక్షిత్ను ఓడించారు. జంతర్ మంతర్ వద్ద కేజ్రీవాల్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించే అవకాశముంది.
కాగా, ఇటీవల జరిగిన ఎన్నికలలో 70 అసెంబ్లీ స్థానాలున్న ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ, మిత్రపక్షాలు 33 స్థానాలు, ఆమ్ ఆద్మీ పార్టీ 28 స్థానాలు, కాంగ్రెసు పార్టీ 8 స్థానాలలో గెలిచిన విషయం తెలిసిందే.