ఆ పార్టీ లాఫింగ్ స్టాక్.. జెపి నడ్డా సెటైర్లు
ఢిల్లీ : బీజేపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ జెపి నడ్డా ఆమ్ అద్మీ పార్టీపై సెటైర్లు వేశారు. ఆ పార్టీ ఒక నవ్వుల మూట లాగా తయారవుతోందని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. శనివారం నాడు ఢిల్లీ స్టేట్కు సంబంధించిన బీజేపీ నేతలతో సమావేశం నిర్వహించిన జెపి నడ్డా పలు అంశాలు ప్రస్తావించారు.
ఢిల్లీలో అధికార పార్టీగా ఉన్న ఆమ్ అద్మీ పార్టీ టార్గెట్గా ఘాటైన వ్యాఖ్యలు చేశారు జెపి నడ్డా. ఢిల్లీ ప్రజల ఆశల మేరకు పనిచేయడంలో ఆ పార్టీ ఘోరంగా విఫలమైందని చెప్పుకొచ్చారు. సమస్యల పరిష్కారానికి ఆప్ నేతలు పనిచేయడం లేదని ఆరోపించారు. అందుకే దేశ రాజధాని అయినటువంటి ఢిల్లీకి బలమైన నాయకత్వంతో కూడిన పార్టీ అధికారంలోకి రావాల్సిన అవసరముందని వ్యాఖ్యానించారు. అది కేవలం బీజేపీతోనే సాధ్యమని అన్నారు.
కేంద్రంలో పవర్ఫుల్.. ఏపీలో బలపడే ప్రయత్నం.. మరి తెలంగాణలో బీజేపీ ఫెయిల్యూరా?
ఢిల్లీ పీఠమే లక్ష్యంగా పార్టీశ్రేణులు పనిచేయాలని జెపి నడ్డా పిలుపునిచ్చారు. ఆమ్ అద్మీ పార్టీ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లి రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ జెండా ఎగురవేయాలని దిశానిర్దేశం చేశారు. గత శాసనసభ ఎన్నికల్లో ఢిల్లీలోని 70 స్థానాలకు ఆమ్ అద్మీ పార్టీ 67 స్థానాలను కైవసం చేసుకోవడం గాలివాటమేనని వ్యాఖ్యానించారు. అయితే ఢిల్లీ ప్రజలు ఇప్పుడు బాధపడుతున్నారని.. అనవసరంగా ఆ పార్టీని గెలిపించామని కలత చెందుతున్నారని చెప్పుకొచ్చారు.
ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు మనోజ్ తివారి కూడా పార్టీ క్యాడర్కు పలు సూచనలు చేశారు. రానున్న ఎన్నికలకు సిద్ధం కావాలని.. బీజేపీ విజయమే లక్ష్యంగా పనిచేయాలని కోరారు. ఢిల్లీలో రోజురోజుకీ తీవ్రమవుతున్న నీటి సమస్య పరిష్కారానికి కృషి చేయడంలో ఆమ్ అద్మీ పార్టీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు. అంతేకాదు ఈ ఐదేళ్లలో చాలా సమస్యలు పెండింగ్లోనే ఉన్నాయని.. బీజేపీ అధికారంలోకి వస్తే వాటన్నింటినీ పరిష్కరిస్తామని తెలిపారు.