మహిళల రక్షణ: ఇక ఢిల్లీ బస్సుల్లో మార్షల్స్!
న్యూఢిల్లీ: ఢిల్లీ రాష్ట్రంలోని బస్సుల్లో మహిళల రక్షణకు ఆ రాష్ట్ర ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. ఢిల్లీలోని రవాణా వ్యవస్థ కారణంగా పలు సందర్భాల్లో అత్యాచారాలు జరుగుతున్న వైనం వెలుగుచూస్తున్న సంగతి తెలిసిందే. దీంతో మహిళల రక్షణకు ఢిల్లీ ప్రభుత్వం నడిపే బస్సుల్లో మార్షల్స్ను ఏర్పాటు చేస్తోంది.
గతంలో 2 వేల మంది గార్డులను నియమించినా, వారితో భద్రత సరిపోవడం లేదని భావించిన రాష్ట్ర ప్రభుత్వం 200 మంది మార్షల్స్ను నియమించనుంది. వీరికి ప్రత్యేక శిక్షణ ఇచ్చిన అనంతరం వారిని బస్సుల్లో నియమిస్తారు.
వీరందరికీ వాకీ టాకీలు కూడా ఇస్తారు. వీరి ద్వారా మహిళలకు రక్షణ పెరుగుతుందని ఢిల్లీ ప్రభుత్వం భావిస్తోంది. ప్రభుత్వ తాజా చర్యలతో మంచి ఫలితాలుంటాయని అధికారులు చెబుతున్నారు.
బస్సుల్లో మహిళల రక్షణ కోసం సెక్యూరిటీ గార్డులను కాంట్రాక్ట్ పద్ధతిలో నియమిస్తామని అధికారులు తెలిపారు. ప్రభుత్వ చర్యలతో మహిళలపై జరుగుతున్న వేధింపులను కట్టడి చేస్తామని చెప్పారు.
తమ పార్టీ ఎన్నికల హామీలో భాగంగానే ప్రభుత్వ బస్సుల్లో మార్షల్స్ను నియమిస్తున్నట్లు ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన నాయకులు తెలిపారు.