పంజాబ్ లో పక్కనపెట్టారు.. గోవాలో గల్లంతయ్యారు! ‘ఆప్’వి ప్రగల్భాలేనా?
‘అంతన్నాడు ఇంతన్నాడే..’అన్న పాట గుర్తొస్తుంది పాపం ఆమ్ ఆద్మీ పార్టీ, దాని వ్యవస్థాపకుడు, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పరిస్థితి చూస్తుంటే.
న్యూఢిల్లీ: 'ఆప్ కా క్యా హోగా జనాబే ఆలీ..'అన్న పాట గుర్తొస్తుంది పాపం ఆమ్ ఆద్మీ పార్టీ, దాని వ్యవస్థాపకుడు, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పరిస్థితి చూస్తుంటే. గత అసెంబ్లీ ఎన్నికల్లో న్యూఢిల్లీ అసెంబ్లీలో 70 సీట్లకుగాను 67 సీట్లు సాధించి ఢిల్లీ గద్దెపై తన జెండా ఎగరేసింది ఈ పార్టీ.
ఆ విజయం తలకెక్కించుకున్న అరవింద్ కేజ్రీవాల్ ఆ తరువాత రెచ్చిపోయారు. అవకాశం దొరికిన ప్రతిసారీ ప్రధాని మోడీ, బీజేపీలపై ఆయన విరుచుకుపడే వారు. ఢిల్లీలో ప్రజల మద్దతుతో అనూహ్యంగా అధికారంలోకి వచ్చిన ఆయన ఏ రాష్ట్రంలో అయినా తనకు ప్రజలు బ్రహ్మరథమే పడతారనే భ్రమలో ఉండేవారు.
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగగానే ఆయన మదిలో ఓ ఆలోచన తళుక్కుమంది. ఇంకేముందీ.. చీపురు చేతపుచ్చుకుని పంజాబ్, గోవాలో స్వీపింగ్ కి దిగిపోయారు. ఎన్నికల ప్రచారంలో కూడా తమ పార్టీ ఈసారి పంజాబ్ లో అధికారం చేపట్టడం ఖాయమని, గోవాలో కూడా తాము ఖాతా తెరుస్తామని ధీమా వ్యక్తం చేసేవారు.
తీరా ఎన్నికల ఫలితాలు వెలువడడం మొదలవగానే.. ఆప్ పరిస్థితి, అరవింద్ కేజ్రీవాల్ అంచనాలు తలకిందులైనట్లు కనిపిపిస్తోంది. ఆయన ధీమాగా ఉన్న రెండు రాష్ట్రాల్లోనూ ఆ పార్టీ పరిస్థితి ఏమాత్రం ఆశాజనకంగా లేదు.
పంజాబ్ లో కాంగ్రెస్ స్పష్టమైన ఆధిక్యం కనబరుస్తుండగా, ఆమ్ ఆద్మీ పార్టీ ఆది నుంచి మూడో స్థానంలోనే కొనసాగుతోంది. ఇక గోవాలో అయితే ఇంత వరకు కనీసం బోణీ కూడా కొట్టలేదు. ఇక్కడ ఇప్పటికే 22 స్థానాల్లో ఆధిక్యాలు వస్తే.. వాటిలో 10 చోట్ల కాంగ్రెస్, 6 చోట్ల ఇతరులు ఉన్నారేగానీ ఆమ్ ఆద్మీ పార్టీ ఆచూకీ కూడా కానరావడం లేదు.
దీంతో ఢిల్లీ ప్రజలేదో ఒక్కసారి అవకాశం ఇచ్చి చూద్దామని ఆప్ కు పట్టం కట్టారే తప్ప.. దేశంలో ఆ పార్టీకి పెద్దగా ప్రజాదరణ లేదని, ప్రస్తుతం పంజాబ్ లో ఆ పార్టీని ప్రజలు పక్కనపెట్టేశారని, ఇక గోవాలో గల్లంతే అవుతుందనే వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. దీంతో 'ఆప్'వి ఒట్టి ప్రగల్భాలేనా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.