కరోల్బాగ్ ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్.. ఢిల్లీలో సీరియస్ కండిషన్.. కేంద్రంతో కేజ్రీవాల్ ఢీ..
దేశరాజధానిలో ఢిల్లీలో కరోనా విలయతాండవం కొనసాగుతోంది. శుక్రవారం ఒక్కరోజే కొత్తగా 223 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అందులో అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే, ఆయన కుటుంబీకులు కూడా ఉండటం గమనార్హం. సెంట్రల్ ఢిల్లీలోని కరోల్ బాగ్ నియోజకవర్గ ఎమ్మెల్యే విశ్వేశ్ రవితోపాటు ఆయన సోదరుడికీ వైరస్ సోకింది. ఈ విషయాన్ని ఎమ్మెల్యేనే స్వయంగా వెల్లడించారు. వైరస్ లక్షణాలు లేనప్పటికీ, టెస్టుల్లో పాజిటివ్ అని తేలిందని, ప్రస్తుతం హోం క్వారంటైన్ కు పరిమితమయ్యామని ఆయన వివరించారు.
శుక్రవారం నాటి 223 కొత్త కేసులతో ఢిల్లీలో మొత్తం కేసుల సంఖ్య 3738కు పెరిగింది. అందులో 1167మంది కోలుకుని డిశ్చార్జ్ అయిపోగా, యాక్టివ్ కేసుల సంఖ్య 2510గా ఉంది. ఇప్పటిదాకా 61 మంది ప్రాణాలు కోల్పోయారు. కేసుల పెరుగుదల రీత్యా ఢిల్లీలో కండిషన్ సీరియస్ గా ఉందనే భావన వ్యక్తమవుతోంది. అయితే, మిగతా రాష్ట్రాలతో పోల్చుకుంటే టెస్టులు ఎక్కువగా నిర్వహిస్తుండటం వల్లే కేసులు కూడా పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయని సీఎం కేజ్రీవాల్ చెప్పారు. ప్రతి 10 లక్షల మందిలో 2,300 మందికి కరోనా టెస్టులు చేస్తున్నామని, ఇది జాతీయ సగటు కంటే చాలా ఎక్కువని ఆయన తెలిపారు.
కరోనా టెస్టుల విషయంలో ముందున్నామన్న కేజ్రీవాల్.. ప్లాస్మా థెరపీపై కేంద్రం చేసిన హెచ్చరికలను మాత్రం లైట్ తీసుకున్నారు. ప్లాస్మా థెరపీని కొవిడ్-19 చికిత్సగా భావించరాదని, అడ్డగోలుగా థెరపీలు నిర్వహిస్తే రోగుల ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుందని, ఐసీఎంఆర్ స్టడీ రిపోర్టు వచ్చేదాకా దాన్ని నివారించడం మంచిదని కేంద్ర ఆరోగ్య శాఖ మూడు రోజుల కిందట హెచ్చరించింది. దీనిపై కేజ్రీవాల్ స్పందిస్తూ.. ఢిల్లీలో ప్లాస్మా థెరపీ మంచి ఫలితాలనిస్తోందని, ఆ విధానాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు.