కేజ్రీవాల్కు మరో షాక్: వివాహేతర సంబంధంపై విశ్వాస్కు సమన్లు
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీకి, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు మరో షాక్. ఆ పార్టీకి చెందిన సీనియర్ నేత కుమార్ విశ్వాస్కు ఢిల్లీ మహిళా కమిషన్ సమన్లు జారీ చేసింది. విశ్వాస్కు తనతో వివాహేతర సంబంధం ఉందనే ఊహాగానాల పైన పెదవి విప్పడం లేదని ఏఏపీలోని ఓ మహిళా కార్యకర్త ఆరోపించినట్లుగా తెలుస్తోంది.
తాను ఫిర్యాదు చేసినా ముఖ్యమంత్రి కేజ్రీవాల్ స్పందించలేదని ధ్వజమెత్తారని సమాచారం. ఈ తరహా ఆరోపణలు పెరగడంతో తన భర్త వదిలేసి వెళ్లిపోయారని విమర్శించారని, ఈ ఆరోపణలను విశ్వాస్ కనీసం ఖండించకపోవడం సరికాదని ఆమె చెప్పారని తెలుస్తోంది.
కాగా ఆ యువతి పోలీసు కమిషనర్కు లేఖ రాసిందని ఢిల్లీ మహిళా కమిషన్ అధ్యక్షురాలు బర్కా శుక్లా సింగ్ చెప్పారు.
అందువల్లే కుమార్ విశ్వాస్, ఆయన భార్యకు నోటీసులు పంపామని, మంగళవారం విచారణకు కమిషన్ ఎదుట హాజరై, వివరణ ఇవ్వాల్సి ఉంటుందన్నారు. కాగా, పార్టీ వాలంటీర్తో కుమార్ విశ్వాస్కు సంబంధముందని, 2014 ఎన్నికల సమయంలో ఇరువురు కలిసి ఉన్నారని ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. మరోవైపు, తన పైన వచ్చిన ఆరోపణలను కుమార్ విశ్వాస్ ఖండించారు.