నాపై కుట్ర జరుగుతోంది: మయాంక్, కంటతడి పెట్టిన కేజ్రీవాల్
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీలో సంక్షోభం కొనసాగుతోంది. అది రోజు రోజుకు ఎక్కువవుతోంది. తాను పార్టీ నుండి వైదొలగుతానని పార్టీ సీనియర్ నేత మయాంక్ గాంధీ హెచ్చరించారు. తనను పార్టీ వ్యతిరేకిగా చిత్రీకరిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ఇటీవల పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ నుండి ప్రశాంత్ భూషణ్, యేగేంద్ర యాదవ్లను తొలగించిన విషయం తెలిసిందే. దీనిని మయాంక్ గాంధీ ఖండించారు. అయితే, పార్టీలోని కొన్ని వర్గాలు తనను లక్ష్యంగా చేసుకున్నాయని మయాంక్ గాంధీ ఆరోపిస్తున్నారు.
పార్టీలోని కొందరు నిర్మణయాత్మక వ్యక్తులు తనను పార్టీ వ్యతిరేకిగా చిత్రీకరించే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. సామాజిక మాధ్యమాల్లో తనను పార్టీకి, ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు వ్యతిరేకిగా చిత్రీకరించే పని పెట్టుకున్నారన్నారు. తద్వారా తనను పార్టీ నుండి తొలగించేందుకు కుట్ర జరుగుతోందని ఆరోపించారు.
కాగా లోకసభ ఎన్నికల్లో ఘోర పరాజయం, పార్టీలో తానే సర్వాధికారినన్న తరహాలో వ్యవహరిస్తున్నారన్న యోగేంద్ర యాదవ్ విమర్శల నేపథ్యంలో జూన్లో జరిగిన జాతీయ కార్యవర్గ భేటీలో కేజ్రీవాల్ కంటతడి పెట్టారని ఏఏపీ నేత అశుతోష్ తాను రాసిన పుస్తకంలో పేర్కొన్నారు. అంతేకాకుండా పార్టీ కన్వీనర్ పదవి నుండి వైదొలగుతానని చెప్పారని చెప్పారు.