పరారీలో ఏఏపీ ఎమ్మెల్యే, స్త్రీతో విశ్వాస్ సంబంధంపై కేజ్రీకి ప్రశ్న
హైదరాబాద్: ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన ఎమ్మెల్యే జర్నైల్ సింగ్ పరారీలో ఉన్నాడని ఢిల్లీ పోలీసులు మంగళవారం చెప్పారు. ఎమ్మెల్యే జర్నైల్ సింగ్ ఓ ఎంసీడీ(మున్సిపల్ కార్పోరేషన్ ఆఫ్ ఢిల్లీ) ఇంజనీర్ను తిట్టాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
జర్నైల్ సింగ్ పశ్చిన ఢిల్లీలోని తిలక్ నగర్ నియోజకవర్గం నుండి ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలుపొందారు. పలువురుతో వెళ్లి ఇంజనీర్ పైన చేయి చేసుకున్నారనే ఆరోపణల నేపథ్యంలో.. ఆయనతో పాటు పలువురి పైన ఎఫ్ఐఆర్ బుక్ చేశారు. సదరు ఇంజనీర్ విధులు నిర్వర్తించకుండా అడ్డుకున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి.
ఢిల్లీ పోలీసు కమిషనర్ బీఎస్ బస్సీ మాట్లాడుతూ.. ఎమ్మెల్యే పరారీలో ఉన్నాడని చెప్పారు. ప్రస్తుతం పరారీలో ఉన్న అతను త్వరలో సరెండర్ అవుతారని భావిస్తున్నామని చెప్పారు. ఇటీవల ఆమ్ ఆద్మీ పార్టీ పైన పెద్ద ఎత్తున విమర్శలు, ఆరోపణలు వస్తున్న విషయం తెలిసిందే.
కమిషన్ ఎధుట హాజరు కాని కుమార్ విశ్వాస్
పార్టీకి చెందిన ఓ మహిళా కార్యకర్తతో సంబంధం ఉందనే ఆరోపణల నేపథ్యంలో ఏఏపీ నేత కుమార్ విశ్వాస్కు ఢిల్లీ కమిషనర్ ఆఫ్ వుమెన్ నోటీసులు జారీ చేసినట్లుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే, ఆయన మంగళవారం నాడు కమిషన్ ఎదుట హాజరు కాలేదు. దీనిపై కుమార్ విశ్వాస్ మాట్లాడుతూ.. తనకు ఎలాంటి నోటీసులు అందలేదని చెప్పారు.
కేజ్రీవాల్ ఇంటి ఎదుట బీజేపీ ఆందోళన
మరోవైపు, ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఇంటి ఎదుట బీజేపీ నేతలు ఆందోళన చేపట్టారు. వారు ఏఏపీ దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు. కుమార్ విశ్వాస్ వివాహేతర సంబంధం పైన కేజ్రీవాల్ స్టాండ్ ఏమిటో చెప్పాలని డిమాండ్ చేశారు.