షాకింగ్: ఏఏపీ ఎమ్మెల్యే ఆస్తులు రూ.130 కోట్లు
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే కర్తార్ సింగ్ తన్వర్ ఆస్తులు రూ.130 కోట్లు ఉన్నట్లుగా ఆదాయపు పన్ను శాఖ అధికారులు లెక్క చెప్పారు. ఐటీ అధికారులు మంగళవారం సోదాలు నిర్వహించారు. ఆయన సంపాదన భారీగా ఉన్నట్లు తెలిపారు.
తన్వర్, ఆయన సోదరుడి ఇంట్లో నుంచి సుమారు రూ.కోటి విలువైన బంగారు ఆభరణాలు, నగదు స్వాధీనం చేసుకొన్నారు. ఇటీవల రెండుసార్లు తన్వర్ను ప్రశ్నించిన ఐటీ శాఖ అధికారులు తాజాగా ఆయన ఇళ్లలో సోదాలు నిర్వహించారు.
గతంలో బీజేపీ నేత అయిన తన్వర్ 2014లో ఆమ్ ఆద్మీ పార్టీలో చేరారు. బీజేపీ నేతృత్వంలోని కేంద్రం రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగా ఐటీ దాడులకు ఉసిగొలుపుతున్నదని తన్వర్ మండిపడ్డారు.
కాగా, ఢిల్లీ ప్రభుత్వాన్ని మోసగించి స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజు ఎగొట్టి తన్వర్ భారీగా భూమి బదలాయింపులు చేశారని ఐటీ వర్గాలు ఆరోపించాయి. 30-35 కంపెనీల్లో ఆయనకు పెట్టుబడులున్నాయని పేర్కొన్నాయి. అక్రమ సంపాదన డాక్యుమెంట్లు, బీనామీ ఆస్తులు అనేకం ఉన్నాయని వెల్లడించాయి.