ఊగిపోయిన ఏఏపీ మహిళా ఎమ్మెల్యే (వీడియో)
ఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే సరితా సింగ్ చిక్కుల్లో పడ్డారు. ఓ పోలీసు అధికారితో అనుచితంగా ప్రవర్తించినందుకు ఆమె పైన కేసు ఫైల్ చేశారు. ఆదివారం నాడు ఎమ్మెల్యే సరితా ప్రయాణిస్తున్న కారు ఏఎస్ఐ ఓంపాల్ బైక్ను ఢీకొట్టింది.
స్వల్ప గాయాలతో బయటపడ్డ ఓంపాల్ ఎమ్మెల్యే కారు డ్రైవర్తో వాగ్వాదానికి దిగారు. ఇంతలో ఎమ్మెల్యే జోక్యం చేసుకుని ఏఎస్సైని అసభ్య పదజాలంతో దూషించారు. ఏఎస్సై ఫిర్యాదు మేరకు ఎమ్మెల్యేపై పోలీసులు కేసు నమోదు చేశారు.
ఈ ఘటనంతటినీ ఓ వ్యక్తి వీడియో తీయగా... ప్రస్తుతం ఈ వీడియో వైరల్గా మారిందని అధికారులు చెప్పారు. ఈ వివాదాన్ని ఎమ్మెల్యే కొట్టిపారేశారు. ముందుగా పోలీసు అధికారే తన పట్ల అసభ్యంగా ప్రవర్తించినట్లు ఆమె పేర్కొన్నారు. తాను కూడా పోలీసులకు ఫిర్యాదు చేస్తానని చెప్పారు.
తాను సీనియర్ అధికారులతో మాట్లాడుతానని చెప్పారు. ఇంటర్నెట్లో హల్ చల్ చేస్తున్న వీడియోలో.. తన పైన ఏఎస్సై దురుసుగా ప్రవర్తించిన సన్నివేశం కట్ చేశారని ఆరోపించారు. కాగా, ఈ సంఘటన ఆదివారం నాడు సాయంత్రం ఏడు గంటల సమయంలో జరిగింది. ఆ సమయంలో ఎమ్మెల్యే సరితా సింగ్ ఓ ఫంక్షన్ కోసం వెళ్తున్నారు.
సారీ చెప్పారు: వసుంధరా రాజే
ఆర్టిస్ట్ పట్ల దురుసుగా ప్రవర్తించిన వ్యవహారంలో పోలీస్ కమిషనర్ క్షమాపణలు చెప్పారని రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధరా రాజే ఆదివారం చెప్పారు. జైపూర్లో ఆర్టిస్ట్ సమ్మిట్ జరిగింది. శనివారం నాడు ఓ సందర్భంలో ఓ పోలీసు ఒక ఆర్టిస్ట్ పట్ల అనుచితంగా వ్యవహరించారు.
దీనిపై సీఎం వసుంధరా రాజే ఆదివారం నాడు స్పందించారు. ఆర్టిస్ట్ పట్ల అనుచితంగా ప్రవర్తించిన పోలీసు పైన చర్యలు తీసుకున్నామని చెప్పారు. తాను వ్యక్తిగతంగా ఆర్టిస్ట్తో మాట్లాడానని చెప్పారు. పోలీస్ దురుసుతనంపై కమిషనర్ క్షమాపణలు చెప్పారన్నారు.