సీఎం యోగి బాటలో ఢిల్లీ సర్కార్.. ఇక్కడా ఆ సెలవుల రద్దు
ఢిల్లీ సర్కారు కూడా యూపీ సర్కారు బాటలో నడవనుంది. ప్రముఖుల జయంతి, వర్ధంతి సందర్భంగా ప్రస్తుతం ఉన్న సెలవులను రద్దు చేయనున్నట్టు ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ప్రకటించారు.
ఢిల్లీ: రాజకీయాల్లో బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీలు ప్రత్యర్థులు. ఒక పార్టీ అంటే మరో పార్టీకి పడదు. అయినా సరే, బీజేపీ ఫైర్ బ్రాండ్, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ బాటలో ఢిల్లీ సర్కార్ నడవనుంది.
ప్రముఖుల జయంతి, వర్ధంతి సందర్భంగా ప్రస్తుతం ఉన్న సెలవులను రద్దు చేయనున్నట్టు ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ప్రకటించారు. ఆయా రోజుల్లో సెలవులు ఉండవని, పనిదినాలుగా పరిగణిస్తామని తెలిపారు.
యూపీలో ప్రముఖుల జయంతులు, వర్ధంతుల సందర్భంగా ఇస్తున్న సెలవుల్లో 15 రద్దు చేస్తున్నట్టు సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రముఖుల జయంతులప్పుడు స్కూళ్లకు సెలవులు ఇవ్వొద్దని, ఆ రోజు ప్రత్యేకంగా తరగతులు నిర్వహించి వాళ్ల గొప్పదనం గురించి రెండు గంటల పాటు పిల్లలకు చెప్పాలని కూడా ఆయన పేర్కొన్నారు.
ఇప్పుడు ఢిల్లీ సర్కారు కూడా ఇదే బాట పట్టనుంది. అయితే ఎన్ని సెలవులు, ఎవరెవరికి సంబంధించినవి రద్దు చేయబోతోందో ఇంకా ప్రకటించలేదుగానీ.. మొత్తానికి సెలవులు రద్దు చేయాలనే నిర్ణయం మాత్రం తీసుకుంది. మున్ముందు ఈ బాటలో మరిన్ని రాష్ట్ర ప్రభుత్వాలు పయనించే అవకాశం లేకపోలేదు.