కేజ్రీవాల్ ఫాలోస్ జగన్: అదే హామీ అదే థీమ్..ఎన్నికల్లో గట్టెక్కేనా..?
Recommended Video
ఢిల్లీ ఎన్నికల పోలింగ్కు నాలుగు రోజుల ముందు అధికార ఆమ్ఆద్మీ పార్టీ తమ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. మేనిఫెస్టో విడుదలకు ముందే ప్రచారం సందర్భంగా పలు హామీలు ఇచ్చారు అరవింద్ కేజ్రీవాల్. నాణ్యతతో కూడిన విద్య, పరిశుభ్రమైన తాగునీరు, మరియు 24 గంటల పాటు నిరంతరాయంగా విద్యుత్ హామీలు ప్రధాన ఆకర్షణగా ఆప్ మేనిఫెస్టోలో నిలిచాయి.
రేషన్ డోర్ డెలివరీ
ఆమ్ ఆద్మీ పార్టీ మేనిఫెస్టోను ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా విడుదల చేశారు. మొత్తం 28 అంశాలను ఈ మేనిఫెస్టోలో పొందుపర్చారు. ఇక రేషన్ను ఆంధ్రప్రదేశ్లో ఎలా అయితే ఇంటివద్దకు వచ్చి వాలంటీర్లు ఇస్తారని ఎన్నికల సందర్భంగా అప్పటి ప్రతిపక్ష నేత జగన్ ఎలా అయితే హామీ ఇచ్చారో అలానే ఢిల్లీలో కూడా రేషన్ ఇంటికి డోర్ డెలివరీ చేస్తామని ఆప్ పార్టీ మేనిఫెస్టోలో పొందుపర్చింది. ఇక 10 లక్షల మంది సీనియర్ సిటిజెన్లకు ఉచితంగా తీర్థయాత్రలు, డ్యూటీలో ఉన్న సఫాయి కర్మాచారీ మృతి చెందితే అతని కుటుంబానికి రూ.కోటి పరిహారంగా చెల్లించనున్నట్లు మేనిఫెస్టోలో ఆప్ పార్టీ ఉంచింది.
విద్య , విద్యుత్, క్లీన్ వాటర్పై ఫోకస్
ప్రతి సామాన్యుడు సుఖసంతోషాలతో జీవించేలా చూడటమే ఆమ్ఆద్మీ పార్టీ విజన్ అని సిసోడియా చెప్పుకొచ్చారు. నాణ్యతతో కూడిన విద్యను విద్యార్థులకు అందించడం, 24 గంటల పాటు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా ఇవ్వడంపైనే ప్రత్యేక దృష్టి సారిస్తామని చెప్పారు. ఇక నాణ్యతతో కూడిన విద్యను అందించడంలో భాగంగా విద్యార్థులకు స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్తో పాటు దేశభక్తి పాఠాలు కూడా ఢిల్లీ స్కూల్స్లో ప్రవేశపెడతామని సిసోడియా చెప్పారు. ఇక మరోసారి అధికారం ఇస్తే మార్కెట్లను 24 గంటల పాటు తెరిచి ఉంచేలా యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటామని చెప్పారు.
జన్లోక్పాల్ తీసుకొచ్చి పాస్ చేయిస్తాం
ప్రధాని మోడీ సోమవారం బహిరంగ సభలో మాట్లాడుతూ లోక్పాల్ గురించి మాట్లాడిన పెద్ద మనుషులు ఏమయ్యారని అరవింద్ కేజ్రీవాల్ను ఉద్దేశిస్తూ వ్యాఖ్యలు చేశారు. దీనికి కౌంటర్గా ఢిల్లీ జన్లోక్పాల్ బిల్లు పాస్ అయ్యేందుకు చర్యలు తీసుకుంటామని సిసోడియా చెప్పారు. యువత మహిళలు, సామాన్యుడి సాధికారికత లక్ష్యంగానే మేనిఫెస్టోను తయారు చేశామని మనీష్ సిసోడియా చెప్పారు.
బీజేపీ సీఎం అభ్యర్థి ఎవరు.. కేజ్రీ సవాల్
బుధవారం మధ్యాహ్నం ఒంటిగంటలోగా బీజేపీ తమ ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించాలని అతనితో చర్చకు తాను సిద్ధంగా ఉన్నట్లు సవాల్ విసిరారు ఢిల్లీ సీఎం ఆప్ నేషనల్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్. బీజేపీ ఈ సవాల్ స్వీకరించి సీఎం అభ్యర్థిని ప్రకటించకపోతే... తన తదుపరి కార్యాచరణ ఏంటో మీడియా ముందు తెలియజేస్తానని కేజ్రీవాల్ చెప్పారు. ఢిల్లీకి ఎన్నికలు ఫిబ్రవరి 8న జరగనున్నాయి... ఫిబ్రవరి 11న ఫలితాలు వెలువడుతాయి. ఇప్పటికే ఆప్ పార్టీ ఢిల్లీలో తిరిగి ప్రభుత్వంలోకి వస్తుందని పలు సర్వేలు ఘోషిస్తున్నాయి.