ఆప్ మేనిఫెస్టో విడుదల: పాక్ అజెండాను బీజేపీ నెరవేరుస్తోందన్న కేజ్రీవాల్
ఢిల్లీ: దేశవ్యాప్తంగా ఎన్నికలు వేడి పెరుగుతోంది. ఇప్పటికే మూడు విడతలు పూర్తి కాగా ఇంకా నాలుగు విడుతలు మిగిలి ఉన్నాయి. ఇప్పటికే పలు పార్టీలు తమ మేనిఫెస్టోలను విడుదల చేశాయి. తాజాగా ఆమ్ఆద్మీ పార్టీ కూడా తమ మేనిఫెస్టోను ఢిల్లీలో విడుదల చేసింది. పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియాలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
దేశ భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికలు
ఆమ్ఆద్మీ పార్టీ తమ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. ఢిల్లీకి రాష్ట్రహోదా దక్కించుకోవడమే ప్రధాన అంశంగా ఇందులో పొందుపర్చింది. 2019 లోక్సభ ఎన్నికలు దేశభవిష్యత్తును నిర్దేశించనున్నాయని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. ఒక పార్టీ విడుదల చేసిన మేనిఫెస్టోలోని అంశాలను మాత్రమే పరిగణలోకి తీసుకోకూడదని సూచించిన కేజ్రీవాల్ దేశ భవిష్యత్తును దిశ దశను మార్చే ఎన్నికలుగా పరిగణించాలని అన్నారు. ఈ ఎన్నికల ద్వారా దేశంలోని ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాలని, ఘనమైన చరిత్రను సంస్కృతులను కాపాడుకోవాలని, రాజ్యాంగ విలువలను రక్షించుకోవాలని పిలుపునిచ్చారు కేజ్రీవాల్.
దేశాన్ని విభజించాలని చూస్తోన్న మోడీ షా జోడీ
బౌద్ధులు, హిందువులు, సిక్కులు తప్ప ఇతర చొరబాటుదారులందరిని తరమి వేస్తామని అమిత్ షా చెబుతున్నారని గుర్తు చేసిన కేజ్రీవాల్... దేశంలో ఉన్న ముస్లింలు, జైనులు, క్రైస్తవులపై సామూహిక దాడులు చేసి మహాసముద్రంలో కలిపేస్తారా అని మండిపడ్డారు. పాకిస్తాన్ అజెండాను బీజేపీ నెరవేరుస్తోందని నిప్పులు చెరిగారు కేజ్రీవాల్. పాకిస్తాన్ కూడా దేశాన్ని విభజించాలని చూస్తోందని చెప్పారు. ముందుగా నరేంద్ర మోడీ అమిత్ షా జోడీని విడగొట్టేందుకు ప్రయత్నం చేయాలని అంటే కేంద్రంలో మళ్లీ బీజేపీ సర్కారు రాకుండా ఓటుతో అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. ఇందుకోసం ఆప్ ఎవరికైనా ఎందాకైనా మద్దతు ఇస్తుందని చెప్పారు.
ఢిల్లీకి పూర్తి స్థాయి రాష్ట్ర హోదా సాధించడమే లక్ష్యం
ఇక మేనిఫెస్టోలో భిన్నమైన అంశాలను ఆప్ పార్టీ పొందుపర్చింది. ప్రధానంగా ఉద్యోగాలు, ఉన్నత విద్య, మహిళలకు రక్షణ లాంటి అంశాలపై దృష్టి సారించింది. ఢిల్లీకి రాష్ట్ర హోదా సాధించేందుకు ఎన్ని అడ్డంకులు వచ్చిన ఎదురొడ్డి నిలుస్తామని చెప్పిన కేజ్రీవాల్... ఏడు ఎంపీ స్థానాలను ఢిల్లీలో గెలిస్తే పూర్తి స్థాయి రాష్ట్ర హోదా ఎందుకు రాదో చూస్తామని చెప్పారు. ఢిల్లీ పోలీసు శాఖలో సంస్కరణలు తీసుకొస్తామని చెప్పిన కేజ్రీవాల్.. ఢిల్లీ పోలీసు శాఖలో భర్తీ చేయాల్సి ఉన్న పోస్టులను భర్తీ చేస్తామని చెప్పారు. అయితే ఇది ఢిల్లీకి పూర్తిస్థాయిలో రాష్ట్ర హోదా వచ్చినప్పుడే సాధ్యపడుతుందని చెప్పారు. ఇక ఇప్పటికే అవినీతిరహిత పాలన ఢిల్లీలో అందిస్తున్నామని చెప్పిన కేజ్రీవాల్ ప్రతి నియోజకవర్గానికి ఒక్కో మేనిఫెస్టో విడుదల చేస్తున్నట్లు తెలిపారు.