పోలీసుల విచారణ: భార్య ముందే సోమనాథ్ కంటతడి
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ శాసన సభ్యుడు, మాజీ న్యాయశాఖ మంత్రి సోమనాథ్ భారతి కంటతడి పెట్టారు. పోలీసులు విచారిస్తున్న సమయంలో ఆయన కన్నీళ్లు కార్చారు. రెండు రోజుల క్రితం ఢిల్లీ పోలీసుల ఎదుట ఆయన లొంగిపోయిన విషయం తెలిసిందే.
భార్య లిపికా మిత్రా ఇచ్చిన ఫిర్యాదు మేరకు అతని పైన గృహ హింస, హత్యాయత్నం కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలో సోమనాథ్ భారతిని ఢిల్లీ పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. పోలీసుల విచారణలో భాగంగా భారతి బోరున విలపించాడు.
భార్యను ఎలా చిత్ర హింసలు పెట్టారు? ఆమెను చంపాలని ఎలా కుట్రలు చేశారు? అని పోలీసులు అడుగుతున్న సమయంలో అతను కన్నీరు పెట్టుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ సమయంలో భార్య లిపికా కూడా అక్కడే ఉన్నారు.
ఇక సోమనాథ్ భారతి ఉంటున్న ద్వారకా రెసిడెన్స్కు కూడా వారిని తీసుకెళ్లి పోలీసులు ప్రశ్నల వర్షం కురిపించారు. కొన్నాళ్లు ఆజ్ఞాతంలో ఉన్న సోమనాథ్ భారతి పైన ఐపీసీ సెక్షన్ 212(తప్పించుకు తిరగడం) కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు చెప్పారు.
ఈ సమయంలో సోమనాథ్ భారతికి ఆశ్రయం ఇచ్చినా ఐదుగురి పైన కూడా కేసులు నమోదు అయ్యాయన్నారు. ఇన్ని రోజులు ఎక్కడెక్కడకు వెళ్లారో, ఆయనకు ఎవరు ఆశ్రయం ఇచ్చారో అనే వివరాలను పోలీసులు సేకరించారు. ఆశ్రయం పొందిన ప్రాంతాల్లో విచారించనున్నారు. కాగా పోలీసులు భార్య లిపిక ఎదుట నలభై నిమిషాలు ప్రశ్నించారు.