అల్కాలంబని ఏమన్లేదు,సారీ చెప్పను: బిజెపి ఎమ్మెల్యే
ఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ మహిళా ఎమ్మెల్యే అల్కా లాంబా పైన బిజెపి ఎమ్మెల్యే ఓపీ శర్మ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ ఏఏపీ కార్యకర్తలు బుధవారం ఆయన నివాసం వద్ద ఆందోళన నిర్వహించారు. ఆయన వెంటనే క్షమాపణ చెప్పి, రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
దీనిపై ఓపీ శర్మ స్పందిస్తూ... తాను ఎవరికీ క్షమాపణ చెప్పేది లేదన్నారు. తనకు మహిళలు అంటే గౌరవం ఉందన్నారు. తాను ఎలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయలేదని వివరణ ఇచ్చారు. కావాలంటే సీసీటీవీ ఫుటేజీ చూసుకోవచ్చునని తెలిపారు.
తాను తప్పు చేశానని భావిస్తే పోలీసులకు ఫిర్యాదు చేసుకోవచ్చునన్నారు. ఓపీ శర్మ ఇంటిని ఏఏపీ కార్యకర్తలు ముట్టడించారు. దీంతో పోలీసులు ఆయన నివాసం వద్ద భారీ భద్రతను ఏర్పాటు చేశారు. భారీకేడ్లు ఏర్పాటు చేశారు. మంగళవారం అసెంబ్లీలో అల్కా లాంబను ఓపీ శర్మ తిట్టాడని ఏఏపీ ఆరోపిస్తోంది.
కాగా, ఢిల్లీ శాసన సభ సభ్యుడిగా ఎన్నికైన బీజేపీ నేత ఓపీ శర్మ (విశ్వాస్ నగర్) ఆ రాష్ట్ర సీఎం అరవింద్ కేజ్రీవాల్ పైన నిన్న మండిపడ్డారు. రాష్ట్రాన్ని ఎలా పాలించాలో తెలియని కేజ్రీవాల్, రోజంతా అబద్ధాలు చెబుతూ కాలయాపన చేస్తున్నారన్నారు.
కేజ్రీవాల్ ఢిల్లీకి రావణుడిలా అవతరించారన్నారు. మరోవైపు, ఎమ్మెల్యే అల్కా లాంబపై వ్యక్తిగత దూషణలకు దిగిన ఓపీ శర్మను సభాపతి రెండు రోజుల పాటు సభ నుంచి సస్పెండ్ చేశారు. కాగా, ఏఏపీ ఎమ్మెల్యేలు మాత్రం ఆయనను ఈ సమావేశాలకు మొత్తం సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.