ఢిల్లీ.. మళ్లీ మాదే: సీఎం కేజ్రీవాల్ ధీమా.. సిగిల్ లైన్ స్ట్రాటజీని ప్రకటించిన ఆప్ కన్వీనర్
ఢిల్లీ అసెంబ్లీకి సోమవారం ఎన్నికల నగారా మోగింది. మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు ఫిబ్రవరి 8న పోలింగ్ జరగనుంది. దీనికి సంబంధించిన షెడ్యూల్ ఈనెల 14న వెలువడనుంది. నోటిఫికేషన్ జారీకి, షెడ్యూల్ ప్రకటనకు మధ్య గడువు వారం రోజులే ఉండటం, ఈ నెల 21 నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలుకానుండటంతో అన్ని పార్టీలూ అలర్ట్ అయ్యాయి. క్యాండిడేట్ల సెలక్షన్ మొదలు క్యాంపెయినింగ్ వరకు పక్కగా ప్లాన్ చేసుకుంటున్నాయి. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో అర్హులైన ఓటర్లు సంఖ్య ఒక కోటి.. 46లక్షల 92వేల 136గా ఉందని రాష్ట్ర చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ రణబీర్ సింగ్ తెలిపారు. వారిలో పురుష ఓటర్లు 80.55 లక్షల మంది కాగా, మహిళలు 66.35 లక్షల మంది ఉన్నారు.
సింగిల్ లైన్ స్ట్రాటజీ
7వ అసెంబ్లీకి ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో ఆప్ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సోమవారం మీడియాతో మాట్లాడారు. ఈ ఎన్నికల్లో తాము సింగిల్ లైన్ స్ట్రాటజీని అమలు చేయబోతున్నామన్నారు. ఐదేళ్లలో చేసి చూపించిన పనులపైనే ఎన్నికల్లో జనాన్ని ఓట్లు అడుగుతామన్నారు. ‘‘ప్రభుత్వ పనితీరు ఆధారంగానే ఈ అసెంబ్లీ ఎన్నికల్లో మేం తలపడబోతున్నాం''అని సింపుల్ గా వెల్లడించారు.
2015 ఎన్నికల్లో మొత్తం 70 స్థానాలకుగానూ కేజ్రీవాల్ నాయకత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ 67 సీట్లు గెలుచుకుని ప్రభంజనం క్రియేట్ చేసింది. వివిధ కారణాలతో కొంత మంది దూరమైనా.. మెజార్టీ ఎమ్మెల్యేలు ఇప్పటికీ క్రేజీవాల్ తోనే కొనసాగుతున్నారు. దాదాపు సిట్టింగ్ ఎమ్మెల్యేలందరికీ మరోసారి అవకాశం కల్పించాలని భావిస్తున్న నేథ్యంలో అభ్యర్థుల ఎంపిక కోసం ఆప్ పెద్దగా కష్టపడాల్సిన అవసరం కూడా లేకుండాపోయింది.
బస్తీ దవాఖానలతో మొదలై..
అసెంబ్లీతో కూడిన కేంద్రపాలిత ప్రాంతం కావడంతో ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ హక్కులు, పరిధిపై కేంద్రంతో నిత్యం లొల్లి నడుస్తున్న సంగతి తెలిసిందే. శాంతిభద్రతలు, సిటీ డెవెలప్మెంట్ తదితర పవర్స్ కేంద్రం చేతుల్లో ఉండటం కేజ్రీవాల్ కు సవాలుగా మారింది. దీంతో ఆయన తన పరిధిలోని శాఖలపై ఫోకస్ పెంచారు. ముఖ్యంగా మొహల్లా దవాఖానా పేరుతో ఏర్పాటు చేసిన హెల్త్ సెంటర్లు, పెద్ద రోగాలకు సైతం ప్రభుత్వాసుపత్రుల్లో ఉచిత చికిత్స, అన్నిటికీ మించి గవర్నమెంట్ ఆస్పత్రుల్లో కార్పొరేట్ హాస్పిటళ్ల తరహాలో మౌలిక సదుపాయల్ని అభివృద్ధి చేయడం ఆప్ సర్కారుకు మంచి పేరు తెచ్చిపెట్టింది.
స్కూళ్లు సూపర్.. నల్లా, పవర్ బిల్లుల మాఫీ
హెల్త్ సెక్టార్ లో సక్సెస్ సాధించిన తర్వాత కేజ్రీవాల్ సర్కారు ప్రభుత్వ స్కూల్లను సంస్కరించే కార్యక్రమానికి పూనుకుంది. ప్రస్తుతం ఢిల్లీలోని గల్లీ స్థాయి ప్రభుత్వ పాఠశాలలు సైతం కార్పొరేట్ స్కూళ్లకు ఏమాత్రం తగ్గకుండా క్వాలిటీ విద్యను అందిస్తున్నాయి. ఉచిత మంచినీటి సరఫరా, కరెంట్ చార్జీల తగ్గిపు తదితర నిర్ణయాలపైనా ప్రజలు బాహాటంగా హర్షం వ్యక్తం చేశారు. అయితే ఈ హర్షాతిరేకాలు ఓట్ల రూపంలోకి కన్వర్ట్ అవుతాయా లేదా అనేది వేచిచూడాలి.