Delhi Exit Poll Result 2020: 44 సీట్లతో ఆప్కే ఢిల్లీ ప్రజల పట్టం: ‘టైమ్స్ నౌ ఐపీఎస్వోఎస్ ’
ఢిల్లీ ప్రజలు తిరిగి ఆమ్ ఆద్మీ పార్టీకి పట్టం కట్టబోతున్నారు. 44 సీట్లతో ఆప్ అధికారం చేపట్టబోతుందని 'టైమ్స్ నౌ ఐపీఎస్వోఎస్' సర్వే సంస్థ అంచనా వేసింది. బీజేపీ 26 సీట్ల వరకు గెలుచుకొని ప్రతిపక్షానికే పరిమితమవుతోందని లెక్కగట్టింది. కాంగ్రెస్ పార్టీ సింగిల్ సీటు కూడా రాదని పేర్కొనడం విశేషం. టైమ్స్ నౌ సర్వే ప్రకారం ఆప్, బీజేపీ మధ్య హోరాహోరీగా పోరు ఉండబోతోంది. ఇతరులు కూడా పెద్దగా ప్రభావం చూపబోరని తెలిపింది.
తగ్గిన పోలింగ్
2015లో ఢిల్లీ అసెంబ్లీలో 67 శాతం పోలింగ్ నమోదైన సంగతి తెలిసింది. ఈ సారి మాత్రం 58 వరకు రికార్డైంది. అది కాస్త అటు ఇటుగా 60 శాతంగా ఉండే అవకాశం ఉంది. పోలింగ్ తగ్గడం, కేంద్రంలో బీజేపీపై ఉన్న వ్యతిరేకతను ఆప్ క్యాష్ చేసుకుందని సర్వే సంస్థ తెలిపింది. ఇప్పుడే కాదు పోలింగ్ ముగిసిన వెంటనే కూడా టైమ్స్ నౌ సర్వే.. 54 నుంచి 60 సీట్లు గెలుచుకుంటుందని తెలిపింది. కానీ చివరికి పోలింగ్ రోజును అది 44 సీట్లకు తగ్గినా.. ఆమ్ ఆద్మీ పార్టీకే ప్రజలు పట్టం కట్టారు.
సగటున కూడా..
వివిధ సర్వే సంస్థల యావరేజ్ చూసుకున్న ఆప్ 47 నుంచి 54 సీట్లు గెలుచుకొని విజయబావుటా ఎగరవేస్తోందని తెలిపాయి. బీజేపీ 15 నుంచి 20 సీట్లు గెలుచుకొని ప్రతిపక్షానికే పరిమితమవుతోందని సగటు లెక్కగట్టింది. ఇదివరకు ఢిల్లీని ఏలిన కాంగ్రెస్ 1-2 సీట్లే గెలుచుకుంటుందని సర్వే సంస్థలు అంచనా గట్టడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
ఆప్ వర్సెస్ బీజేపీ
ఎన్నికల ప్రచారంలో కూడా ఆప్-బీజేపీ మధ్యే సాగింది. సీఎం అభ్యర్థిని ప్రకటించడం లేదని సీఎం కేజ్రీవాల్ బీజేపీని విమర్శించిన సంగతి తెలిసిందే. కమలమే తమ అభ్యర్థిని డిసైడ్ చేస్తుందని బీజేపీ నేతలు చెప్పినా.. ప్రజలు మాత్రం విశ్వసించలేదు. మళ్లీ చీపురు పార్టీకే పట్టం కట్టబోతున్నారు. ఎగ్జిట్ పోల్స్లో ఆప్కే పట్టం కట్టబోతున్నారనే వార్తలతో ఆ పార్టీ నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల 11వ తేదీన మంగళవారం ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియను చేపట్టనున్నారు.