'సీఎం అలా ఆదేశిస్తే.. ఆ పార్టీలో ఒక్కరూ ప్రాణాలతో మిగలరు'
పంజాబ్ సీఎం కోడలు, కేంద్రమంత్రి హర్సిమ్రత్ కౌర్ బాదల్ ఆమ్ ఆద్మీ పార్టీని ఉద్దేశించి పదునైన వ్యాఖ్యలు చేశారు.
చంఢీఘడ్: పంజాబ్లో ఎన్నికల రాజకీయం వేడెక్కింది. ముఖ్యంగా ప్రధాన పార్టీలైన శిరోమణి అకాలీ దళ్, ఆమ్ ఆద్మీ పార్టీల మధ్య మాటల యుద్దం ముదురుతోంది. తాజాగా బుధవారం నాడు పంజాబ్ సీఎం కోడలు, కేంద్రమంత్రి హర్సిమ్రత్ కౌర్ బాదల్ ఆమ్ ఆద్మీ పార్టీని ఉద్దేశించి పదునైన వ్యాఖ్యలు చేశారు.
తమ పార్టీ అధినేత, పంజాబ్ సీఎం ప్రకాశ్ సింగ్ బాదల్ గనుక హింసాత్మక దాడులకు దిగాలని పిలుపునిస్తే.. పంజాబ్ లో ఆమ్ ఆద్మీ పార్టీ మద్దతుదారులు ఒక్కరు కూడా మిగలబోరని హర్సిమ్రత్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
సీఎం బాదల్ పై సిక్కు రాడికల్ యువకుడు ఒకరు చెప్పుతో దాడి చేసిన నేపథ్యంలో బఠిండా ఎంపీ అయిన హర్సిమ్రత్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం సందర్బంగా ఈ వ్యాఖ్యలు చేశారు. హర్సిమ్రత్ కౌర్ బాదల్ భర్త అయిన డిప్యూటీ సీఎం సుఖ్ బీర్ సింగ్ బాదల్ కాన్వాయ్ పై కూడా రాళ్ల దాడి జరిగిన సంగతి తెలిసిందే.
గత నాలుగు వారాల్లో బాదల్ కుటుంబం లక్ష్యంగా రెండుసార్లు దాడులు జరిగాయి. అయితే ఈ దాడుల వెనుక ఆమ్ ఆద్మీ పార్టీ హస్తముందని హర్సిమ్రత్ ఆరోపిస్తున్నారు. తమ పార్టీ శ్రేణులు గనుక తిరగబడితే ఆమ్ ఆద్మీ నామరూపాలు లేకుండా పోతుందని హెచ్చరించారు. హర్యానా మూలాలు ఉన్న కేజ్రీవాల్ కు పంజాబ్ సమస్యలపై ఏమాత్రం చిత్తశుద్ది లేదని హర్సిమ్రత్ విమర్శించారు.