ఆరుషి హత్య: తల్లిదండ్రులే దోషులు, కోర్టులోనే ఏడ్చారు
లక్నో: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఆరుషి - హేమరాజ్ జంట హత్యల కేసులో ఆరుషి తల్లిదండ్రులను దోషులుగా నిర్ధారిస్తూ ఉత్తర ప్రదేశ్లోని ఘజియాబాద్ సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం సోమవారం తీర్పును వెలువరించింది. కోర్టు వారికి మంగళవారం మధ్యాహ్నం రెండు గంటలకు శిక్షను ఖరారు చేయనుంది. తల్లిదండ్రులు రాజేష్ తల్వార్, నుపుర్ తల్వార్లు నేరస్తుల అని సిబిఐ చేసిన వాదనతో కోర్టు ఏకీభవించింది.
పోలీసులు వారిని దస్నా జైలుకు తరలించనున్నారు. కోర్టు తీర్పు వెలువడగానే రాజేష్, నుపుర్లు కోర్టు హాలులోనే బోరున విలపించారు. వారికి సెక్షన్ 302 కింద కోర్టు రేపు శిక్షను ఖరారు చేయనుంది. ఈ హత్య కేసులో ఐదున్నరేళ్ల తర్వాత తీర్పు వెలువడింది. తీర్పును తాము హైకోర్టులో సవాల్ చేస్తామని రాజేష్ తల్వార్ చెప్పారు. తీర్పుతో నిరాశ చెందామని, ఓటమిని అంగీకరించమన్నారు. న్యాయం కోసం పోరాడుతామని, అలహాబాద్ హైకోర్టుకు వెళ్తామన్నారు.
కాగా అంతకుముందు ఆరుషి - హేమరాజ్ జంట హత్యల కేసులో కోర్టు తీర్పు నేపథ్యంలో న్యాయస్థానం వద్ద భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. దేశవ్యాప్తంగా కేసు సంచలనం రేపిన విషయం తెలిసిందే. దీంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు.
2008 మే 16న ఆరుషి - హేమరాజ్ల హత్య జరిగింది. ఈ ఘటనపై సిబిఐ కోర్టులో పదిహేను నెలలుగా విచారణ కొనసాగుతోంది. ఆరుషి తల్లిదండ్రులు రాజేశ్ తల్వార్, నుపుర్ తల్వార్లో వారిని హత్య చేశారని సిబిఐ అభియోగాలు నమోదు చేసింది. దర్యాఫ్తు సమయంలో కేసు అనేక మలుపులు తిరిగింది. ఇప్పుడు కోర్టు వారిని దోషులుగా నిర్ధారించింది.