ఆరుషి - హేమరాజ్ హత్య: తల్లిదండ్రులకు జీవిత ఖైదు
లక్నో: సంచలనం సృష్టించిన ఆరుషి - హేమరాజ్ జంట హత్యల కేసులో ఆరుషి తల్లిదండ్రులకు ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్ సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం మంగళవారం జీవిత ఖైదు విధించింది. తమకు కోర్టు విధించిన శిక్ష పైన పైకోర్టుకు వెళ్తామని ఆరుషి తల్లిదండ్రులు చెప్పారు. ఈ కేసు చాలా అరుదైనదని, నిందితులకు మరణ శిక్ష విధించాలని సిబిఐ తరఫు న్యాయవాది అంతకుముందు వాదించారు.
ఆరుషి - హేమరాజ్ జంట హత్యల కేసులో ఆరుషి తల్లిదండ్రులను దోషులుగా నిర్ధారిస్తూ న్యాయస్థానం సోమవారం తీర్పును వెలువరించిన విషయం తెలిసిందే. తల్లిదండ్రులు రాజేష్ తల్వార్, నుపుర్ తల్వార్లు నేరస్తుల అని సిబిఐ చేసిన వాదనతో కోర్టు ఏకీభవించింది. పోలీసులు వారిని దస్నా జైలుకు తరలించారు. ఆధారాలు మాయం చేసి కోర్టును తప్పుదారి పట్టించినట్లుగా వారిపై సిబిఐ అభియోగాలు మోపింది.
నిన్న కోర్టు తీర్పు వెలువడగానే రాజేష్, నుపుర్లు కోర్టు హాలులోనే బోరున విలపించారు. వారికి సెక్షన్ 302 కింద కోర్టు రేపు శిక్షను ఖరారు చేశారు. ఈ హత్య కేసులో ఐదున్నరేళ్ల తర్వాత తీర్పు వెలువడింది.
కాగా, తీర్పును తాము హైకోర్టులో సవాల్ చేస్తామని, తీవ్ర నిరాశ చెందామని, ఓటమిని అంగీకరించమన్నారు, న్యాయం కోసం పోరాడుతామని, అలహాబాద్ హైకోర్టుకు వెళ్తామని రాజేష్ తల్వార్ చెప్పారు.
2008 మే 16న ఆరుషి - హేమరాజ్ల హత్య జరిగింది. ఈ ఘటనపై సిబిఐ కోర్టులో పదిహేను నెలలుగా విచారణ కొనసాగుతోంది. ఆరుషి తల్లిదండ్రులు రాజేశ్ తల్వార్, నుపుర్ తల్వార్లో వారిని హత్య చేశారని సిబిఐ అభియోగాలు నమోదు చేసింది. దర్యాఫ్తు సమయంలో కేసు అనేక మలుపులు తిరిగింది. ఇప్పుడు కోర్టు వారిని దోషులుగా నిర్ధారించి శిక్ష విధించింది.