బాహుబలి ప్యాకేజీలో రైతుల వాటా.. వ్యవసాయం, అనుబంధ రంగాలపై నిర్మలా సీతారామన్ కీలక ప్రకటనలు
కరోనా వైరస్ దెబ్బకు కుదేలైపోయిన దేశ ఆర్థిక వ్యవస్థను తిరిగి దారిలో పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం రూ.20 లక్షల కోట్లతో 'ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్' ప్యాకేజీని ప్రకటించింది. ఆ ప్యాకేజీలోని అంశాలను ఒక్కొక్కటిగా వివరిస్తోన్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.. శుక్రవారం ప్యాకేజీ మూడో విడత వివరాల్ని వెల్లడించారు. తొలి విడతలో ఎంఎస్ఎంఈలకు సంబంధించి రూ.5.94 లక్షల కోట్ల విలువైన 16 అంశాలను చెప్పిన నిర్మల.. రెండో దశలో వలస కూలీలు, చిన్న రైతుల కోసం తొమ్మిది అంశాలతో కూడిన రూ.3.16 లక్షల కోట్ల విలువైన ప్యాకేజీ వివరాలను తెలియజేశారు. మూడో రోజైన శుక్రవారం.. వ్యవసాయం, దానికి అనుబంధంగా కొనసాగే పాడి, మత్య్స, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాలపై మంత్రి మాట్లాడారు.
''దేశంలో సప్లై చైన్ ఎలా ఉండాలో, దానికి టెక్నాలజీని ఎలా జోడించాలో ప్రధాని మోదీ తన సందేశంలో పేర్కొన్నారు. దాన్ని అనుసరించి ఇవాళ నేను.. వ్యవసాయం, వ్యవసాయ అనుబంధాలైన డైరీ, యానిమల్ హస్బెండరీ, ఫిషరీస్ తదితర రంగాలకు ప్యాకేజీ ద్వారా ఎలాంటి మేలు జరుగుతుందో వివరిస్తాను. ఈ రంగంలో మొత్తం 11 అంశాలను ప్రాతిపదికగా తీసుకుని, ప్యాకేజీలో వాటికి దక్కబోయే వాటాను నిర్ధారించాం.
పంటలు చేతికొచ్చిన ఈ కీలక దశలోనే లాక్ డౌన్ కొనసాగినప్పటికీ.. గడిచిన రెండు నెలల్లో రైతులకు కనీస మద్దతు ధరగా కేంద్రం రూ.74, 300కోట్లు చెల్లించింది. గడిచిన రెండు నెలల కాలంలో ప్రధాన మంత్రి కిసాన్ యోజన(పీఎం కిసాస్) పథకం కింద దేశంలోని పేద రైతుల ఖాతాల్లోకి నేరుగా రూ.18,700 కోట్లు జమ చేశాం. అలాగే, పీఎం ఫసల్ బీమా యోజన కింద గత రెండు నెలల్లోనే రూ.6,400 కోట్లు విడుదల చేశాం.
పాడి పరిశ్రమకు రూ.5వేల కోట్లు..
పలు కారణాల వల్ల పాల సేకరణ రంగం ప్రస్తుతం ఇబ్బందుల్లో ఉంది. ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ ప్యాకేజీలో భాగంగా ఆ రంగాన్ని ఆదుకునేందుకు రూ.4,100 రూపాయలు వెచ్చించి, మిగులు పాలను సహకార డెయిరీల ద్వారా సేకరించాం. 202021 సంవత్సరానికిగానూ పాడి సహకార సంస్థల కోసం రూ.5వేల కోట్ల లిక్విడిటీని అన్ లాక్ చేశాం. తద్వారా 2కోట్ల మంది రైతులకు ప్రయోజనం కలుగుతుంది. ఆయా సంస్థలకు రెండు శాతం వడ్డీని కూడా ఉపసంహరించుకుంటున్నాం.
మౌలిక సదుపాయాలకు రూ.1లక్ష కోట్లు..
వ్యవసాయ రంగంలో మౌలిక సదుపాయల కల్పన కోసం రూ.1లక్ష కోట్లు కేటాయించాం. దీని ద్వారా ఈ రంగంలో కీలక భూమిక పోషించే ప్రాథమిక సహకార సంఘాలు, రైతు సంఘాలు, అగ్రికల్చర్ స్టార్టప్ లకు లబ్ధి చేకూరుతుంది. అలాగే, ఫుడ్ సెక్టార్ లో సూక్ష్మ పరిశ్రమకుల రూ.10 వేల కోట్లు ఇస్తాం. ప్రధాని మోదీ ఇచ్చిన ‘వోకల్ ఫర్ లోకల్'పులుపునకు అనుగుణంగా మేం ముందుకువెళుతున్నాం.
మత్యకారులకు బోట్లు, బీమా..
ఆత్మ నిర్భర్ ప్యాకేజీలో భాగంగా మత్య రంగానికి రూ.20 వేల కోట్లు కేటాయించాం. ఈ ఏడాది బడ్జెట్ ప్రసంగంలోనే మత్య సంపద యోజన పేరుతో కొత్త పథకం ప్రకటించాం. మన దేశంలో సుమారు 55 లక్షల మంది ఈ రంగంలో ఉపాధి పొందుతున్నారు. వాళ్లందరికీ వ్యక్తిగత బోట్లు అందించడంతోపాటు బీమా సౌకర్యం కూడా కల్పిస్తాం. మొత్తంగా రాబోయే ఐదేళ్లలో.. ఇప్పుడున్న దానికంటే 70 లక్షల టన్నులు అధికంగా మత్స్య ఉత్పత్తి సాధిస్తామనే నమ్మకముంది’’ అని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వివరించారు.