యాప్లు..స్టార్టప్లు: యువతలో ఉన్న స్పెషాలిటీ అదే: దేశ భవిష్యత్తుకు అదే ఆధారం: మోడీ
న్యూఢిల్లీ: స్వదేశీ పరిజ్ఙానంతో యాప్ల తయారీపై దృష్టి సారించామని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలిపారు. ఆత్మనిర్భర్ భారత్ ఉద్యమంలో భాగంగా యాప్ల తయారీకి పెద్ద ఎత్తున ప్రోత్సాహకాలను ప్రకటిస్తున్నామని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా అత్యున్నతంగా ఎదిగిన కంపెనీలన్నీ ఒకప్పుడు స్టార్టప్లుగా ఆవిర్భవించినవేనని అన్నారు. బిజినెస్ యాప్స్, గేమ్స్ యాప్స్, పిల్లల కోసం యాప్స్.. ఇలా అన్ని కేటగిరీల్లోనూ వాటిని అభివృద్ధి చేయాల్సి ఉందని అన్నారు.
యాప్లతో దేశ భవిష్యత్..
ప్రధాని తన రేడియో కార్యక్రమం మన్ కీ బాత్ ద్వారా దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. మన్ కీ బాత్ సిరీస్లో ఇది 68వ ఎపిసోడ్. ఈ సందర్భంగా మోడీ.. యాప్లు, స్టార్టప్ల గురించి ప్రస్తావించారు. భారతీయులు తయారు చేసిన యాప్ల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. లాక్డౌన్ అమల్లో ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో పిల్లలు పాఠశాలలకు దూరం అయ్యారని, ఆ లోటును భర్తీ చేయడానికి ప్రత్యేకంగా ఆన్లైన్ ఎడ్యుకేషన్ యాప్లను అందుబాటులోకి తీసుకొచ్చామని చెప్పారు.
దేశీయ పరిజ్ఙానంతో..
ఇందులో భాగంగా కుటుకి యాప్ను రూపొందించామని అన్నారు. చింగారి యాప్, ఆస్క్ సర్కార్ యాప్, స్టెప్ సెట్ గో యాప్ వంటి సూక్ష్మ, మధ్య స్థాయి సాంకేతిక పరిశ్రమల ద్వారా వాటిని రూపొందించామని చెప్పారు. పూర్తి స్వదేశీ పరిజ్ఙానంతో రూపొందించిన ఈ యాప్స్ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు సాధించాయని అన్నారు. స్టార్టప్లుగా ఏర్పాటైన యాప్ల తయారీ సంస్థలు.. భవిష్యత్తులో అత్యున్నత స్థాయికి ఎదుగుతాయని తాను విశ్వసిస్తున్నానని చెప్పారు.
నేటి ప్రముఖ కంపెనీలు.. నాటి స్టార్టప్స్..
ప్రపంచాన్ని ఏలుతోన్న అనేక సంస్థలు స్టార్టప్లుగా ఆవిర్భవించినేననే విషయాన్ని విస్మరించకూడదని అన్నారు. దేశ యువత సొంతంగా అనేక కంప్యూటర్ గేమ్స్ను అభివృద్ధి చేస్తున్నాయని, ఇది స్వాగతించదగ్గ పరిణామమని అన్నారు. ఘనత వహించిన భారత చరిత్రను ప్రతిబింబించేలా ఆన్లైన్ గేమ్స్ను రూపొందించాల్సిన అవసరం ఉందని ప్రధానమంత్రి చెప్పారు. ఆత్మనిర్భర్ భారత్ ఉద్యమంలో భాగంగా.. విర్చువల్ గేమింగ్ సెక్టార్, బొమ్మల పరిశ్రమలను అబివృద్ధి చేయాల్సి ఉందని అన్నారు.
రెండు, మూడో శ్రేణి నగరాల నుంచీ..
ఆత్మనిర్భర్ భారత్ యాప్ ఇన్నోవేషన్ ఛాలెంజ్ కోసం ఏడువేలకు పైగా దరఖాస్తులు అందాయని చెప్పారు. వాటిల్లో మూడొంతులు రెండో, మూడో టయర్ సిటీలకు చెందిన యువత నుంచే వచ్చాయని, ఇది శుభసూచకమని అన్నారు. భవిష్యత్తులో భారత్.. యాప్ల రూపకల్పన, కంప్యూటర్ గేమింగ్లో స్వయం సమృద్ధిని సాధించగలుగుతుందనడానికి ఇది నిదర్శనమని మోడీ చెప్పారు. రెండు, మూడో శ్రేణి నగరాలకు చెందిన యువత ఈ రంగంపై దృష్టి సారించడానికి ఆ దరఖాస్తులే నిదర్శనమని అన్నారు.
Recommended Video
సెప్టెంబర్ను పౌష్టికాహార మాసంగా..
సెప్టెంబర్ నెలను పౌష్టికాహార మాసంగా ప్రకటించినట్లు వెల్లడించారు ప్రధాని. ఈ నెలరోజుల పాటు పౌష్టికాహారోత్పత్తి, సరఫరాపై దృష్టి సారించాల్సి ఉంటుందని అన్నారు. దేశ భవిష్యత్తుకు అదే ఆధారమని అన్నారు. పౌష్టికాహారం అందినప్పుడే మేథస్సుకు పదును పెట్టినట్టవుతుందని చెప్పారు. కొత్త ఆలోచనలు పుట్టుకొస్తాయని అభిప్రాయపడ్డారు. పౌష్టికాహార లోపాన్ని తీర్చడానికి సెప్టెంబర్ నెలలో అనేక కార్యక్రమాలను చేపట్టేలా ప్రణాళికలను రూపొందించామని ఆయన తెలిపారు.