కిడ్నాప్, రేప్, సెక్స్రాకెట్, పెళ్లి: బాలిక.. మహిళగా వచ్చింది!
న్యూఢిల్లీ: తల్లిదండ్రుల ఒడిలో ఎంతో ఆనందంగా పెరగాల్సిన చిన్నారి భరించరాని కష్టాలను చవిచూసింది. 12ఏళ్ల వయస్సులోనే అపహరణకు గురైన ఆ బాలిక.. అత్యాచారానికి గురైంది. ఆ తర్వాత ఆ దుర్మార్గుల నుంచి వ్యభిచార రొంపిలో బలవంతంగా అడుగుపెట్టింది. అంతటితో ఆమె కష్టాలు ఆగలేదు. ఓ వృద్ధుడిని పెళ్లి చేసుకుని ఇద్దరు పిల్లలకు తల్లి కూడా అయ్యింది.
ఆ తర్వాత వారు గెంటేయడంతో పదేళ్లపాటు అష్టకష్టాలు పడి చివరకు ఎలాగోలా తన తల్లిదండ్రుల వద్దకు చేరుకుంది. తమ కూతురు తమ వద్దకు చేరిందని సంబరపడినా.. తనకు ఎదురైన చేదు అనుభవాలను తెలపడంతో ఆ తల్లిదండ్రులు తీవ్ర ఆవేదనకు గురయ్యారు. ఈ దారుణాతి దారుణ ఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటు చేసుకుంది.
ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. ఈశాన్య ఢిల్లీలోని శీలంపూర్ జనతాకాలనీకి చెందిన 12ఏళ్ల బాలిక తన బంధువుల ఇంటికి వెళుతుండగా వ్యభిచారం నడిపే ముఠా సభ్యులైన దంపతులు ఆమెను బలవంతంగా కారులోకి ఎక్కించుకొని అపహరించుకు వెళ్లారు. ఈ ఘటనపై 2006వ సంవత్సరంలో న్యూఢిల్లీ పోలీసులు బాలిక అపహరణపై కేసు నమోదు చేసినా ఎలాంటి ఆచూకీ లభించలేదని మూసివేశారు.
నాడు అపహరణకు గురైన ఆ బాలిక.. ఎన్నో అష్టకష్టాలు పడి పదేళ్లపాటు కామాంధుల చెరలో ఉండి బయటపడిన 22ఏళ్ల యువతిగా తాను పడిన కష్టాలను పోలీసులకు వెల్లడించింది. వ్యభిచార రాకెట్ గురించి బాధిత యువతి చెప్పిన మాటలు పోలీసులనూ విస్మయపర్చాయి.
బాధితురాలు చెప్పిన వివరాలిలా ఉన్నాయి... బాధిత బాలికను కారులో అపహరించిన ఓ దంపతులు అంబాలాకు తీసుకువెళ్లి పదిమంది బాలికలున్న ఓ గదిలో 20 రోజులపాటు బంధించారు. అనంతరం గుజరాత్ రాష్ట్రంలోని ఓ గ్రామ రైతుకు విక్రయించారు. ఆ తర్వాత ఆమెను ఓ వ్యవసాయ క్షేత్రంలోని గదిలో తాళం వేసి రెండేళ్ల పాటు ఉంచారు. అప్పుడు రైతు కుమారుడు బల్వంత్ ఆమెపై తరచూ అత్యాచారం చేసేవాడు.
ఆమెపై అత్యాచారం చేయడమే కాకుండా శరీరంపై సిగరెట్లతో కాల్చేవాడు. రెండేళ్ల తర్వాత తనను అపహరించిన దంపతులు తిరిగి వచ్చి నన్నుపంజాబ్ రాష్ట్రానికి తీసువెళ్లి అక్కడ జర్నేల్ అనే వ్యక్తికి రెండోసారి విక్రయించారు. జర్నేల్ ఆమెను భగీరాసింగ్ అనే వృద్ధుడితో బలవంతంగా పెళ్లి చేశాడు.
బాధిత యువతి.. మామ్ వీర్, రంజిత్ లనే ఇద్దరు కొడుకులకు జన్మనిచ్చింది. మూడేళ్ల తర్వాత ఆమె వృద్ధ భర్త మరణించడంతో వారి కుటుంబసభ్యులు పిల్లలను తీసుకొని యువతిని బయటకు పంపించారు. దీంతో ఆమె దిక్కుతోచక తన స్వస్థలమైన ఢిల్లీకి ఎలా చేరాలో తెలియక డ్యాన్స్ బార్లో పనిచేసే ఓ మహిళను ఆశ్రయించింది.
ఆ మహిళ బాధిత యువతిని పశ్చిమ బెంగాల్ లోని సిలిగురికి తీసుకువెళ్లింది. ఆపై ఆమెను పుట్టింటికి తీసుకువెళతానని హామీ ఇచ్చింది. ఆ మహిళ సాయంతో ఎట్టకేలకు తన స్వస్థలమైన ఢిల్లీలోని జనతా కాలనీకి వచ్చి స్థానికుల సహకారంతో పుట్టింటికి చేరుకున్నట్లు బాధిత యువతి కన్నీటి పర్యాంతమైంది.
బాధిత బాలిక ఫిర్యాదును సీరియస్గా తీసుకున్నట్లు న్యూఢిల్లీ ఈశాన్య డీసీపీ ఏకే సింగ్లా చెప్పారు. 2006వ సంవత్సరంలో జరిగిన ఈ బాలిక కిడ్నాప్ కేసును తిరిగి తెరచి వ్యభిచార ముఠా వ్యవహరంపై దర్యాప్తు ప్రారంభించామని తెలిపారు.