ఉగ్ర ఘాతుకం: అపహరించిన జవానును కాల్చి చంపారు
శ్రీనగర్: జమ్మూకాశ్మీర్లో ఉగ్రవాదులు మరో ఘాతుకానికి పాల్పడ్డారు. రంజాన్ పండగ నేపథ్యంలో భారత ప్రభుత్వం ప్రకటించిన కాల్పుల విరమణను అలుసుగా తీసుకుని ఉగ్రవాదులు రెచ్చిపోతున్నారు. గురువారం కిడ్నాప్ చేసిన భారత సైనికుడ్ని ఉగ్రవాదులు కాల్చి చంపారు.
పుల్వామాలో జవానును అపహరించిన ఉగ్రవాదులు
రంజాన్ పండగ కోసం సెలవుపై ఇంటికి వెళ్లున్న ఔరంగజేబ్ అనే సైనికుడ్ని ఉగ్రవాదులు పుల్వామాలో గురువారం ఉదయం కిడ్నాప్ చేశారు. అనంతరం ఆ జవాన్ను కాల్చి చంపారు. సాయంత్రం జవాన్ మృతదేహాన్ని భద్రతా దళాలు కనుగొన్నాయి. పూంఛ్కు చెందిన ఔరంగజేబ్.. 44 రాష్ట్రీయ రైఫిల్స్లో పనిచేస్తున్నారు.
సీనియర్ పాత్రికేయుడి కాల్చివేత
ఇది ఇలా ఉండగా, సీనియర్ పాత్రికేయుడు, రైజింగ్ కాశ్మీర్ సంపాదకుడు సుజాత్ బుఖారీ(50)ని ఉగ్రవాదులు కాల్చి చంపారు. ఆయన వ్యక్తిగత భద్రత అధికారిని కూడా వారు కాల్చి చంపారు. శ్రీనగర్లోని ప్రెస్ ఎన్క్లేవ్లో ఉన్న తన కార్యాలయం నుంచి ఇఫ్తార్ విందుకు హాజరయ్యేందుకు ఆయన బయటకు రాగానే ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో మరొక పోలీసు, ఒక పౌరుడు గాయపడ్డారు. వీరిద్దరి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు చెప్పారు.