హిందూ మైనర్ బాలికల అపహరణ: పాకిస్థాన్కు భారత్ సమన్లు
న్యూఢిల్లీ: పాకిస్థాన్లో మైనార్టీ వర్గాలపై జరుగుతున్న దాడులకు ఇటీవల కొన్ని సంఘటనలు నిదర్శనంగా నిలిచిన విషయం తెలిసిందే. పాకిస్థాన్ దేశం ఏర్పడిన నాటి నుంచి ఆ దేశంలో మైనార్టీలైన హిందువులు, సిక్కులు, క్రిస్టియన్ వర్గాల ప్రజలపై తీవ్రమైన దాడులు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ దాడులతో పాకిస్థాన్లో హిందువుల సంఖ్య భారీగా తగ్గిపోయింది. బలవంతంగా మతం మర్చడం, చంపడం లాంటి చర్యలతో ఈ పరిణామం చోటు చేసుకుంది.
కాగా, మైనార్టీ హిందువుల బాలికలను బలవంతంగా అపహరించి వారిని మతమార్పిడులకు పాల్పడుతున్న ఘటనలపై భారత్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ హైకమిషన్ అధికారులకు శుక్రవారం భారత్ సమన్లు పంపింది.
జనవరి 14న పాకిస్థాన్ సింధ్ ప్రావిన్స్లోని ఉమర్ గ్రామానికి చెందిన శాంతి మెఘ్వాద్, సార్మి మెఘ్వాద్ అనే ఇద్దరు హిందూ మైనర్ బాలికలు అపహరణకు గురయ్యారు. ఈ ఘటనను తీవ్రంగా ఖండించిన భారత్.. వెంటనే ఆ బాలికలను క్షేమంగా వారి కుటుంబసభ్యులకు అప్పగించేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది.
పాకిస్థాన్లో మైనార్టీలైన హిందువులపై ఇలాంటి ఘటనలు తరచూ చోటు చేసుకోవడంపై భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. జనవరి 15న జరిగిన మరో ఘటనలో పాకిస్థాన్ జకోబాబాద్ జిల్లాలోని సింధ్ ప్రావిన్స్కు చెందిన మెహక్ అనే హిందూ బాలిక అపహరణకు గురైంది. కాగా, ఇలాంటి ఘటనలు పాకిస్థాన్లో సర్వసాధారణమైపోయాయి. ఇలాంటి పరిస్థితుల్లోనే పాకిస్థాన్లోని మైనార్టీలైన హిందువులు, సిక్కులు, క్రిస్టియన్లు, జైనులు, బౌద్ధులు మనదేశంలోకి శరణార్థులుగా వస్తున్నారు.